ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ విషమ పరీక్షను ఎదుర్కోనున్నారు. ఆయన పరిపాలనకు ఈ ఎన్నికలకు అద్దం పట్టనున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని యోగి ఆదిత్యానాధ్ ప్రారంభించారు. అయోధ్య నుంచి ఆయన ప్రచారం ప్రారంభమయింది. అయోధ్యను నగర్ నిగమ్ గా మార్చిన ఘనత బీజేపీదేనని యోగి ఆదిత్యానాధ్ అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఆయన వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలయినప్పటికీ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు.
ఎన్నికల ప్రచారానికి శ్రీకారం....
మరోవైపు సమాజ్ వాదీ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. యోగి ఆదిత్యానాధ్ వచ్చిన తర్వాత ఉత్తర ప్రదేశ్ తిరోగమనంలో పయనిస్తుందని సమాజ్ వాదీ నేతలు ఆరోపిస్తున్నారు. బీఎస్పీకూడా స్థానికసంస్థల ఎన్నికల్లో పాగా వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ ఎన్నికల్లో విజయం తమదేనని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రతిరోజూ పరీక్షేనని, ఎన్నికలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ప్రజలు తమవెంటే ఉన్నారన్న యోగి ఆదిత్యానాధ్ గత పాలకులు చేసిన పాపాన్ని కడగటానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందన్నారు.