ముందే కూస్తున్న కోడి : అప్పుడే ఎన్నికల సర్వేలా?

Update: 2016-10-22 05:09 GMT

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే? ఇది ఊహాజనితమైన ప్రశ్న. అది జరిగేది కాదు. అయినప్పటికీ ఈ ప్రశ్నతో సెంటర్ ఫర్ సేఫాలజి సంస్థ తెలంగాణలో పూర్వపు పది జిల్లాల్లో సర్వే చేసింది. 495 మండలాల్లో41.310 మందిని కలిసి అభిప్రాయాలు సేకరించిందట. వీరంతా కేసీఆర్ పాలను తెగమెచ్చుకున్నారని, ఎన్నికలు జరిగితే తెరాసకే ఓటు వేస్తామని చెప్పారట. ఆ ప్రకారం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 109 స్థానాల్లో తెరాస విజయసుందుభి మోగిస్తుందని సర్వేలో తేల్చారు. విపక్షాలకు కేవలం పది సీట్లు వస్తాయని, తెదేపా, వైకాపా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక్క సీటు కూడా గెల్చుకోవలని సర్వే నివేదికలో వెల్లడించారు. తెరాస ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు అయిన సందర్భంలో ఈ సర్వే జరిపించినట్టు కనిపిస్తోంది. సర్వే ఎందుకు చేశారనే దానిపై స్పష్టత లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎందుకని చేయలేదో సంస్థ ప్రకటించలేదు. సర్వేలో తెరాసకు 67.9 శాతం ఓట్లు వచ్చి 109 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.

భాజపా 2.1 శాతం ఓట్లతో ఒక సీటు గెలుస్తుందట, 2.4 శాతం ఓట్లతో మజ్లిస్ 7 సీట్లు గెలిస్తే, 4.4 శాతం ఓట్లు వచ్చే తెదేపా మాత్రం ఒక్క సీటు గెలవదని సర్వేలో చెప్పడం చిత్రంగా ఉంది. తక్కువ ఓట్లు వచ్చే పార్టీలు గెలిస్తే , ఎక్కువ ఓట్లు వచ్చే పార్టీ ఓడుతుందా? తెరాస పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సర్వే నివేదిక ప్రతిబింబించలేదనే చెప్పాలి. సంక్షేమ పథకాల తీరు బెటరుగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వ పనితీరుపై విమర్శలున్నాయి. మీడియా మేనేజ్ మెంట్ వల్ల సమస్యలు వెలికిరావడం లేదనే ఆరోపణలున్నాయి.. తెరాసకు చెందిన 11మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలో తేల్చారు. అంటే వ్యతిరేకత ఏ మేరకు ఉందో స్పష్టమవుతోంది. మంత్రి పోచారం పనితీరుని ప్రజలు ఎండగట్టారట.

ముఖ్యంగా హైదరాబాద్ లో డెవలప్ మెంట్ ఆగిపోయింది. మెట్రో, రోడ్లు, మంచినీళ్లు, శాంతి భద్రతలు వంటి వాటితో పాటుగా ఫీజ్ రియింబర్స్‌మెంట్ ఆరోగ్య శ్రీ, మల్లన్న సాగర్, ఎంసెట్ నిర్వహణలో విఫలం వంటి విషయాల్లో తెరాస ప్రభుత్వ పనితీరు ప్రజల్లో ప్రతిబింబించలేదని అనుకోవాలా? నిజానికి సర్వేలో నిబద్దత చాలా తక్కువ. 2014 ఎన్నికల్లో సర్వే నివేదికలు ఎలా ఉన్నాయో గుర్తుతెచ్చుకుంటే మంచిది. తమిళనాడులో జయలలిత ఓడి పోతుందని అప్పటి సర్వేలు చెప్పాయి. కాబట్టి సర్వేలు ప్రజల అభిప్రాయాలను అచ్చంగా ప్రతిబింబిస్తాయని కాదు గానీ, ఇప్పుడు ఏ సందర్భంలో చేశారో చెప్పకుండా వివరాలు వెల్లడించడమే ఆశ్చర్యంగా ఉంది.

Similar News