IPL 2024 : పోస్టుమార్టం చేసుకోవాల్సిందే.. ఎప్పుడూలేనిది ఇంత గతి ఎందుకు పట్టిందంటే?

కోల్‌కత్తా నైట్ రైడర్స్ పై ముంబయి ఇండియన్స్ ఓటమి పాలయింది.

Update: 2024-05-04 04:16 GMT

ఎందుకో ఈ సీజన్ ముంబయి ఇండియన్స్ కు అచ్చిరాలేదు. తొలి నుంచి అంతే. ఎంత తక్కువ స్కోరును కూడా అది ఛేజ్ చేయలేక చేతులెత్తేస్తుంది. ప్లేఆఫ్ నుంచి ఇప్పుడు ముంబయి ఇండియన్స్ పూర్తిగా తప్పుకున్నట్లే. ఎందుకిలా జరిగిందని అనుకునే కన్నా.. జట్టులో అందరూ వైఫల్యాల బాటనే నడిచారు. ఒక కెప్టెన్ ను మార్చినంత మాత్రాన ఇది జరగలేదు. రోహిత్ శర్మ ఈ సీజన్ లో రాణించలేకపోయాడు. హార్ధిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటర్లు, బౌలర్లు కూడా పెద్దగా రాణించలేకపోవడానికి జట్టు యాజమాన్యం పోస్టుమార్టం చేసుకోవాల్సిందే. సులువుగా గెలిచే స్కోరును కూడా ఛేజింగ్ లో సాధించలేకపోవడం ఆ జట్టు వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? అందుకే ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ కు ఈ సీజన్ చేదు ఫలితాలను మిగిల్చిందనే చెప్పాలి.

మూడు మ్యాచ్‌లు మాత్రమే...
ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ పదకొండు మ్యాచ్‌లు ఆడితే అందులో మూడు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. ఏడు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచింది. ఇప్పుడు ఆరు పాయింట్లతో ఉన్న ముంబయి ఇండియన్స్ కు ఇక ప్లేఆఫ్ ఛాన్స్ లేనట్లే. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నిజానికి చాలా తక్కువ స్కోరు చేసింది. ఈ స్కోరు కూడా చేయలేక కోల్‌కత్తా నైట్ రైడర్స్ పై ముంబయి ఇండియన్స్ ఓటమి పాలయింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ లో సాల్ట్, నరేన్ విఫలమయినా వెంకటేశ్ అయ్యర్ 70పరుగులు చేశాడు. మనీష్ పాండే 42 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది.
టార్గెట్ సాధనకు...
170 పరుగుల లక్ష్యసాధనకు ముంబయి ఇండియన్స్ దిగింది. ఐపీఎల్ లో ఇది పెద్ద స్కోరు ఏమీ కాదు. ఏ ఒక్కరిద్దరు ఆటగాళ్లు క్లిక్ అయినా స్కోరును ఛేజింగ్ చేసి విజయం సాధించవచ్చు. కానీ ముంబయి ఇండియన్స్ ఆ పని కూడా చేయలేకపోయింది. ఓపోనర్లుగా వచ్చిన ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యారు. సూర్యకుమార్ మాత్రం 56 పరుగులుచేసి అవుటయ్యాడు. సూర్యకుమార్ ఉన్నంత సేపు విజయం ముంబయి వైపు మొగ్గు చూపినా ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ త్వరగానే అవుటయ్యాడు. వధేరా ఆరుపరుగులు చేసి వెనుదిరిగాడు. డేవిడ్ 24 పరుగుల చేసశాడు. 18.5 ఓవర్లలోనే ముంబయి ఇండియన్స్ ఆల్ అవుట్ కావడంతో విజయం కోల్‌కత్తా నైట్ రైడర్స్ ను వరించింది. వెంకటేశ్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.



Tags:    

Similar News