బెజవాడలో బాహాబాహీ తప్పదా?

Update: 2017-10-27 02:37 GMT

విజయవాడలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య సభ కలకలం రేపుతోంది. కంచె ఐలయ్య సన్మాన సభకు పోటీగా ఆర్య వైశ్యులు, బ్రాహ్మణులు పోటీ ఆత్మీయ సభను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 28న రెండు వర్గాలు విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో సభలను ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. కాని పోలీసులు రెండు సభలకు అనుమతిని ఇవ్వడానికి నిరాకరించారు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా అనుమతిని నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎవరికి వారు సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బెజవాడలో టెన్షన్ నెలకొంది.

వెళ్లితీరతానంటున్న ఐలయ్య.....

ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆర్యవైశ్యులపై కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు పుస్తకం రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదం చెలరేగుతూ వస్తుంది. కంచెఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులతో పాటు బ్రాహ్మణసంఘాలు కూడా నిరసనలు వ్యక్తంచేస్తూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం ఈపుస్తకంపైచెలరేగుతున్న వివాదంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష కూడా చేశారు. దీంతో బెజవాడలో ఐలయ్య సంఘీభావ సభను జేఏసీ ఏర్పాటు చేసంది. దీనికి పోటీగా ఆర్యవైశ్య,బ్రాహ్మణులు ఆత్మీయ సమావేశాన్నిఏర్పాుటు చేశారు. ఒకేరోజు,ఒకే చోట సభలను ఏర్పాటు చేయడంతో పోలీసులు రెండు సభలకు అనుమతిని నిరాకరించారు. కాని ఐలయ్య మాత్రం తాను 28వ తేదీన సభకు ఖచ్చితంగా వెళతానని చెబుతున్నారు. తనను అరెస్ట్ చేస్తే ఏపీలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేదన్న విషయం ప్రపంచం మొత్తం తెలుస్తుందని ఐలయ్య చెబుతున్నారు. సభకు మరోరోజు అనుమతిచ్చినాతమకు అభ్యంతరం లేదంటున్నారాయన. మొత్తం మీద ఐలయ్య వివాదం బెజవాడలో కాకరేపుతోంది.

Similar News