టాలీవుడ్లో గత నాలుగు ఏళ్లుగా సంక్రాంతి ఫైట్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోతోంది. ఒకేసారి భారీ అంచనాలు ఉన్న మూడు నాలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో సహజంగానే అన్ని మంచి సినిమాలకు మంచి థియేటర్లు దొరకవు. గతేడాది నాలుగు సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ల రచ్చ ఓ రేంజ్లో జరిగింది. ఈ యేడాది సంక్రాంతికి కూడా చిరు ఖైదీ నెంబర్ 150, బాలయ్య శాతకర్ణి సినిమాల ప్రదర్శన విషయంలో థియేటర్ల ఫైట్ ఓ రేంజ్లో జరిగింది.
సంక్రాంతికి కోడిపందెమే.....
ఇక వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పవన్కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమా (వర్కింగ్ టైటిల్ అజ్ఞాతవాసి), బాలయ్య జై సింహా సినిమాల మధ్య సంక్రాంతి ఫైట్ జరగనుంది. వీటిల్లో పవన్ సినిమా జనవరి 10న, బాలయ్య సినిమా జనవరి 12న వస్తున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు రవితేజ టచ్ చేసి చూడు కూడా ఉంది. అనుష్క భాగమతి కూడా సంక్రాంతికే వస్తుందని అనుకున్నా ఆ సినిమాను సంక్రాంతి రేస్ నుంచి తప్పించేసి రిపబ్లిక్ డేకు మార్చేశారు.
పాత రికార్డులు తిరగేయడం ఖాయం....
ఇక పవన్ - త్రివిక్రమ్ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా కలెక్షన్లు కుమ్మేస్తుందని, టాలీవుడ్లో పాత రికార్డులకు పాతరేయడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య జై సింహా సినిమా పక్కా మాస్ సినిమా. ఈ సినిమాను పవన్ సినిమాకు పోటీగా నిలబెట్టాలని ప్లాన్ చేసిన బాలయ్య అండ్ జై సింహా యూనిట్ బీ, సీ సెంటర్లలో భారీ ఎత్తున ఇప్పటికే థియేటర్లు బుక్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్యకు మాస్ ఇమేజ్ ఎక్కువ. బీ, సీ సెంటర్లలో సింగిల్ స్క్రీన్లు ఈ సినిమాకే ఎక్కువుగా థియేటర్లు బుక్ చేసినట్టు తెలుస్తోంది.
బీ,సీ, సెంటర్లు బుక్ చేశారే....
ఏపీలో చాలా జిల్లాల్లో బీ, సీ సెంటర్లలో ఇప్పటికే బాలయ్య జై సింహాకు భారీగా థియేటర్లు బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం ఎంతో కొంత అజ్ఞాతవాసి చిత్రంపై ఉంటుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పవన్ సినిమాకి ఓ రేంజ్లో థియేటర్లు ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు క్యూలో ఉన్నారు. నైజాంలో పవన్ ది వన్ మ్యాన్ షో. ఏపీకి వచ్చేసరికి బాలయ్య అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పాటు సింగిల్ స్క్రీన్లు ఎక్కువుగా బుక్ చేయడంతో ఇక్కడ బాలయ్య జై సింహాకు కాస్త ఎక్కువగానే థియేటర్లు దొరుకుతున్నాయి.