ప్రజారాజ్యం పార్టీలాగే జనసేనను కూడా విలీనం చేసే ప్రతిపాదన ఒకటి వచ్చిందట. ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. హైదరాబాద్ లో అమిత్ షా ను కలిసినప్పుడు ఆయన విలీన ప్రతిపాదనను తన ముందుంచారని చెప్పారు పవన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశంలో ప్రాంతీయ పార్టీలకు తావు లేదని, జాతీయ పార్టీలే హవా చూపిస్తాయని తనతో చెప్పారన్నారు. అందువల్ల జనసేనను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను తన ముందుంచారన్నారు. అయితే తాను పార్టీ పెట్టింది సామాన్యుల కోసమేనని, వారి సమస్యల పరిష్కారం కోసమనేనని, అధికారం కోసం కాదని ఆనాడే అమిత్ షాకు చెప్పానని పవన్ ఈ సందర్భంగా వివరించారు.