వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను కొద్దిసేపటి క్రితం ముగించారు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ చిగిచర్లకు చేరుకోగానే యాత్రను ముగిస్తున్నట్లు ప్రకటించారు. రేపు శుక్రవారం కావడంతో జగన్ హైదరాబద్ లోని సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. శుక్రవారం మాత్రం పాదయాత్రకు విరామమిస్తారు. ప్రతి గురువారం రాత్రి వరకూ పాదయాత్ర చేసి హైదరాబాద్ బయలుదేరే జగన్ ఈ సారి మాత్రం మధ్యాహ్నానికే యాత్రను ముగించారు. అనంతపురం జిల్లా మారుమూల ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నందున రోడ్డు మార్గాన హైదరాబాద్ వెళ్లేందుకు సమయం పడుతుందని భావించి మధ్యాహ్నమే ఆయన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. రేపు జగన్ పాదయాత్ర ఉండదు.