తలైవాకు తిరుగులేకుండా ఉండేందుకు...!

Update: 2018-02-14 17:30 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ, విధివిధానాలపై సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ సిద్ధాంతాలు, పేరు, గుర్తు, సభ్యత్వం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మక్కల్ మండ్రం నేతలతో జరిగే ఈ సమావేశాల్లో కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తులను ప్రారంభించారు. మరో రెండు నెలల్లోనే పార్టీని ప్రకటించే అవకాముండటంతో ప్రస్తుతం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తాను పెట్టబోయే కొత్త పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నది ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.

రెండుకోట్లకు సభ్యత్వం....

రజనీకాంత్ పార్టీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా మక్కల్ మండ్రంను ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులను చేర్పిస్తున్నారు. మక్కల్ మండ్రలో సభ్యత్వాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆన్ లైన్ తో పాటు ఇంటింటికి తిరిగి సభ్యత్వాలను చేరుస్తున్నారు. రజనీ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారని మక్కల్ మండ్ర నేతలు చెబుతున్నారు. పార్టీ ప్రకటించక ముందే మక్కల్ మండ్రలో కోటి మంది సభ్యులు ఉండాలన్నది రజనీకాంత్ లక్ష్యంగా కన్పిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నది రజనీ ఆలోచనగా ఉంది.

నేటి నుంచి మూడురోజుల పాటు.....

తాను రాష్ట్ర పర్యటనకు బయలుదేరే ముందే కోటి మంది సభ్యులు పార్టీలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యత్వం ఎలా సాగుతుందన్న దానిపై రజనీ ముఖ్యులు ఈ భేటీలో ఆరా తీస్తున్నారు. కోటి నుంచి రెండుకోట్లకు సభ్యత్వాలు చేరిన తర్వాతనే పార్టీ పేరును, సిద్ధాంతాలను, విధి విధానాలను ప్రకటించే అవకాశముందంటున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన మక్కల్ మండ్ర నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సమాశాల్లో రజనీ పాల్గొనకపోయినా వారి అభిప్రాయాలను సేకరించి సన్నిహితులు రజనీకి అందజేయనున్నారు. ఇప్పటికే చెన్నైలో మక్కల్ మండ్ర మొదటి రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరో రెండు రోజులు ఈ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం మీద రజనీకాంత్ తాను అనుకున్నట్లుగా తమిళ రాజకీయాల్లో అతి త్వరలోనే దూసుకురావడం ఖాయంగా కన్పిస్తోంది.

Similar News