జేసీ బ్రదర్స్ ఇలాకాలో జగన్ జైత్రయాత్ర కొనసాగతున్నారు. తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ అడ్డా. ఆ నియోజకవర్గంలో వారికి పట్టుంది. ప్రస్తుతం జగన్ తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పర్యటించారు. తాడిపత్రిలో జగన్ ను చూసేందుకు పెద్దయెత్తున తరలి వచ్చారు. జేసీబ్రదర్స్ ఎప్పుడు సమయం దొరికినా జగన్ ను విమర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై చిందులు తొక్కుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో జగన్ పర్యటన ఎలా సాగుతుందోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ జగన్ ముందుకు వెళుతున్నారు. 29వ రోజుకు జగన్ పాదయాత్ర చేరుకుంది. ఈరోజు జగన్ గుమ్మేపల్లి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరిచారు. మధ్యాహ్నం 3గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతోంది. శింగనమల నియోజకవర్గంలోనూ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తాడిపత్రిలోనూ జనం తరలి వచ్చారు.
అధినేత పాదయాత్ర....నేతల బస్సుయాత్ర....
జగన్ పాదయాత్రలో ఉండగానే వైసీపీ నేతలు బస్సు యాత్ర ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పోలవరం బయలుదేరి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు వీరు ప్రాజెక్టును సందర్శించారు. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదరులున్నారు. పోలవరం ప్రాజెక్టును 2018 లోగా పూర్తి చేయాలన్న డిమాండ్ తో వీరి బస్సుయాత్ర జరుగుతోంది. తాము వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాత పోలవరం సత్వర నిర్మాణంపై చంద్రబాబుపై వత్తిడి తెస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద అధినేత పాదయాత్రలో ఉంటే నేతలు బస్సు యాత్ర చేయడం విశేషం. మరోవైపు ఇదే రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించడం గమనార్హం.
400 కిలోమీటర్లు దాటిన జగన్....
జగన్ పాదయాత్ర కొద్దిసేపటి క్రితం 400 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. అనంతపురం జిల్లా గుమ్మేపల్లి వద్ద ఆయన 400కిలోమీటర్ల దూరాన్ని దాటారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మొక్క నాటారు. నవంబరు 6వ తేదీన ప్రారంభమైన జగన్ ప్రజాసంకల్ప యాత్ర కడప, కర్నూలు జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.