ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదని వైసిపి అధినేత వైఎస్ జగన్ తమ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం గట్టిగా చేశారు. విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు తరువాతే వచ్చే ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయవని ఈ అంశమని విడవకుండా పోరాటంగా సాగాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా అటకెక్కిన అంశంగా టిడిపి బిజెపిలు మార్చేసిన క్రమంలో వైసిపి ఇదే విషయంపై నిలదీయాలని జగన్ ఎంపీలకు సూచనలు చేశారు. పార్లమెంట్ కేంద్రంగా విజయ సాయి, మేకపాటి, మిధున్ రెడ్డి తదితర ఎంపీలు చేస్తున్న ఆందోళనలపై జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
హోదా పై టిడిపికి ఇరకాటమే ...
ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజి చాలా సూపర్ అంటూ చెప్పుకొచ్చిన తెలుగుదేశం ఇప్పుడు హోదా అంశంపై మాట మార్చలేని పరిస్థితి. సరిగ్గా ఈ అంశం దగ్గరే టిడిపి తన ధోరణితో ప్రజల ముందు దోషిగా నిలబడుతుందని వైసిపి అధినేత భావిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా వైసిపి మొదటి నుంచి హోదా అంశంపై వివిధ పోరాటాలు చేసిన సంగతిని జగన్ ఎంపీలకు గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు అధికారమే విపక్షం లా నటించడాన్ని జనం గమనిస్తున్నారని ఈ విషయాన్ని బాగా ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు జగన్. నాలుగేళ్లుగా ఏపీ దగా పడుతూ ఉంటే ఎన్నికల ఏడాదే వారికి గుర్తు వచ్చిందా అని నిలదీయాలని వైసిపి అధినేత గీతోపదేశం చేస్తున్నారు.
జగన్ బాటలోనే ...
అధినేత డైరెక్షన్ లో విజయసాయి, మేకపాటి, మిధున్ రెడ్డి పార్లమెంట్ ఇంటా బయటా విజృంభిస్తున్నారు. కేంద్రం వైఖరిని తూర్పురాబడుతూనే టిడిపి నాటకాలు చూడండి ప్రజలారా అంటూ తమదైన శైలిలో ఎన్డీయే భాగస్వామి డబల్ రోల్ ఎత్తి చూపిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలిసిందే అంటూ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. వాస్తవానికి వైసిపి నేతల కన్నా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతి సెషన్ లోను ప్రత్యేక హోదా పై ఒంటరి పోరాటం గట్టిగానే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పోరాటానికి వైసిపి కూడా తోడుగా నిలవడంతో టిడిపి ఈ అంశంపై మాత్రం ఆత్మరక్షణలో పడింది. హోదా ఇవ్వాలని చెప్పలేక ప్యాకేజి ప్యాకేజి అంటూ నానా హైరానా పడుతుంది. ఇలా టిడిపి ని జగన్ డిఫెన్స్ లో పడేయడంలో సక్సెస్ కావడంతో వైసిపి శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది