వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు కదిరిలో అనూహ్య స్పందన కన్పిస్తోంది. కదిరి నియోజకవర్గంలో ప్రవేశించిన జగన్ ను చూసేందుకు వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. కదిరి నియోజకవర్గంలో ఇంతటి రెస్పాన్స్ వస్తుందని వైసీపీ నేతలు కూడా ఊహించలేకపోయారు. ఇక సాయంత్రం జరిగిన కదిరి బహిరంగ సభకు జనం పోటెత్తారు. జనాన్ని చూసిన జగన్ ఫిదా అయిపోయారు. కదిరి నియోజకవర్గంలో వైసీపీ గెలిచినా ప్రస్తుత ఎమ్మెల్యే చాంద్ పాషా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఇక్కడ టీడీపీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అందుకోసమే కదిరిలో జగన్ పాదయాత్ర సక్సెస్ అవుతుందో? కాదో? అన్న సందేహం చివరకూ పార్టీ నేతలను పట్టిపీడించింది. అయితే చివరకు జగన్ సభకు పెద్దయెత్తున జనం తరలి రావడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ఊహించని స్పందన...
కదిరి పట్టణంలో ఊహించని స్పందన రావడంతో ఆయన హుషారుగా కన్పించారు. దీంతో అనేకహామీలను గుప్పించారు. ఆరోగ్యశ్రీ పథకంపై మరింత స్పష్టత ఇచ్చారు. వైసీపీ సర్కార్ వస్తే వెయ్యి రూపాయల కంటే ఖరీదయ్యే ప్రతి వైద్య సేవను ఆరోగ్య శ్రీ పథకంలోకి తీసుకువస్తామని హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. ఇక చంద్రబాబు సర్కార్ పై జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతూ పాలన చేస్తున్నారన్నారు. చంద్రన్న మాల్స్ పేరిట ప్రజలను దగా చేసేందుకు సిద్దమయ్యారన్నారు. బయట దొరికే ధరలకంటే ఎక్కువ ధరలకు అమ్ముతూ చంద్రన్న మాల్స్ ప్రజలను దోచుకుంటున్నాయనిచెప్పారు. ఫ్యూచర్ గ్రూప్ ద్వారా చంద్రబాబు లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కదిరిపట్టణంలో వచ్చిన స్పందన చూసి జగన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. నేడు కూడా జగన్ కదిరి నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు.
43వ రోజు యాత్ర షెడ్యూల్ ఇదే...
43వ రోజు ఆయన పాదయాత్ర జరుగుతోంది. నిన్న జగన్ మొత్తం 14.3 కిలోమీటర్ల దూరం నడక సాగించారు. ఇప్పటికి 591.6 కిలోమీటర్ల దూరం జగన్ పాదయాత్ర చేశారు. 43వ రోజు పాదయాత్ర కదిరి పట్టణం నుంచి బయలుదేరనుంది. మదర్వ తండా కదిరి, గంగానపల్లె క్రాస్ రోడ్స్, కమటం పల్లి, కోటిపల్లి క్రాస్ రోడ్స్, డోర్నాల నల్లవారి పల్లి మీదుగా కటారుపల్లికి జగన్ చేరుకుంటారు. అక్కడ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం ఆదివారం జగన్ పాదయాత్ర గాండ్లపెంటలో ముగుస్తోంది. రాత్రికి అక్కడే జగన్ బస చేయనన్నారు.