వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. జగన్ రాజకీయాలన్నీ డ్రామానేనని కొట్టిపారేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు తూర్పారపడుతున్నారు. ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఏప్రిల్ 1వ తేదీ అని డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. మరోసారి ఏపీ ప్రజలను ఏపీ ఫూల్స్ చేయడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఇదంతా జగన్నాటకమేనని వారు తేల్చిపారేశారు.
రాజీనామాలకు క్షణం పట్టదు....
తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలంటే క్షణం పట్టదన్నారు. కాని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామనిచెప్పారు. కేంద్రంనుంచి రావాల్సిన నిధుల కోసం తమ పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో కేంద్రంలో గందరగోళాన్నిసృష్టించేందుకే జగన్ ఈ రాజీనామాలను తెరపైకి తీసుకు వచ్చారని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తే ఏం ప్రయోజనముంటుందని ప్రశ్నించారు. రాజీనామాలు ఆమోదం కావాలంటేనే రెండు నెలలకు పైగానే సమయం పడుతుందని, ఈలోపు ఎన్నికలు వస్తాయనే జగన్ ఈ నాటకానికి తెరలేపారని విమర్శించారు.
ఎమ్మెల్యేలు మావైపు చూస్తున్నారు.....
అలాగే బీజేపీ, ప్రధానినరేంద్ర మోడీ లపై జగన్ తన స్పష్టమైన వైఖరిని తెలపాలన్నారు. బీజేపీని, మోడీని పల్లెత్తు మాట అనని జగన్ రాజీనామాలు చేస్తానంటే కేంద్రం ఎందుకు ప్రత్యేక హోదా ఇస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే పాదయాత్రలో జనం రాక ఇబ్బంది పడుతూ సెన్సేషన్ కో్సం, ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకే జగన్ రాజీనామాలు చేస్తామని ప్రకటించారన్నారు. పాదయాత్ర పూర్తయ్యే లోపు జగన్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరన్నారు. ఇప్పటికే తమ పార్టీలో చేరేందుకు కొందరు ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపుతున్నారనిచెప్పారు. ఇప్పటికైనా జగన్ డ్రామాలు ఆపకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కదని మంత్రులు జోస్యం చెప్పారు.