వైఎస్ జగన్ పాదయాత్రపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆరా తీశారు. పాదయాత్ర జరుగుతున్న తీరును ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతిని విజయసాయి రెడ్డి కలిసిన సందర్భంగా జగన్ పాదయాత్ర అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే రాజ్యసభ ఎన్నికల కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతుందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పెద్దయెత్తున ఆఫర్ చేస్తుందని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఆఫర్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడన్నారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, వారిపై అనర్హత వేటు వేయమని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాష్ట్రపతికి విజయసాయి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.