జగన్ ను ఎంత తిడితే అంత మంచిదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవల జగన్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆదినారాయణరెడ్డి జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేల్చారు. రాయలేని భాషలో జగన్ ను దూషించారు. దీనికి వైసీపీ నేతలు వారి వ్యాఖ్యలు తమకు మంచి చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం అవుతుంటే... ఏసీ రూముల్లో కూర్చుని అవినీతికి పాల్పడుతూ తమ అధినేతను దూషిస్తే ప్రజలు వారినే చీదరించుకుంటారన్నారు.
ప్రజలు నమ్మబోరంటున్న....
జగన్ ను దూషించనందున ఆయనకు ఏమీ కాదని, జగన్ పై అసత్య ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మబోరన్నారు. గత కొంతకాలంగా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెబుతున్నారు. సీబీఐ కేసులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పెట్టించిందేనని ప్రజలకు తెలుసునన్నారు. ఆరోజు జగన్ కాంగ్రెస్ ను వదలిపెట్టకుండా ఉండి ఉంటే ఒక్క కేసు కూడా నమోదయి ఉండేది కాదని, అయితే ఈ కేసులన్నింటి నుంచి తమ అధినేత కడిగిన ముత్యంలా బయటపడతారని, టీడీపీ నేతల తిట్లే తమకు దీవెనలంటున్నారు వైసీపీ నేతలు.
ఒక్క రోజు విరామం తర్వాత....
జగన్ పాదయాత్ర ఒక్కరోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. జగన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో జగన్ శుక్రవారం పాదయాత్రకు ఒక్కరోజు విరామమిచ్చారు. తిరిగి శనివారం పాదయాత్రను జగన్ ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం జగన్ బస చేసిన ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. కాంతంవారిపల్లి క్రాస్ రోడ్స్, చిన ఇర్లపాడు క్రాస్ రోడ్స్, పేరంగుంట కొత్తపల్లి క్రాస్ రోడ్స్, చింతలపాలెం వరకూ చేరుకుంటారు. చింతలపాలెంలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడ భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు కనిగిరి పట్టణం చేరుకుంటారు. కనిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం కనిగిరి శివారు ప్రాంతమైన టకారిపాలెంలో జగన్ రాత్రి బస చేయనున్నారు.