వైఎస్ జగన్ పాదయాత్ర 88వ రోజు కు చేరుకుంది. దాదాపు మూడు నెలల నుంచి జగన్ ప్రజాసంకల్ప పాదయత్ర చేస్తున్నారు. పాదయాత్రలోనే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక హామీలు పాదయాత్ర చేస్తున్నప్పుడు పుట్టుకొచ్చినవే. 45 ఏళ్లకే పింఛను మంజూరు, నెలకు రెండు వేల రూపాయల పింఛను, పిల్లలను బడికి పంపితే తల్లులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామనడం వంటివి ప్రజలను కలుసుకున్నప్పుడు ఆయన అప్పటికప్పడు అనుకున్నవి హామీల రూపంలో ఇచ్చేసినవే. పాదయాత్రలో ప్రజల బాధలను స్వయంగా తెలుసుకుంటున్న జగన్ వారికి పూర్తి భరోసా కల్పించేలా హామీలను గుప్పిస్తున్నారు.
ప్రత్యేక హోదాపై....
ఇక ప్రత్యేక హోదా ప్రాధాన్యతను కూడా తొలినుంచి వివరిస్తూ వచ్చిన జగన్ తాజాగా ఎంపీల రాజీనామాల విషయాన్ని ప్రకటించారు. తొలుత కీలక నేతలతో సమావేశాన్ని నిర్వహించిన జగన్ తన నోటి నుంచే ఆ ప్రకటన చేశారు. రాజీనామాలు ఏడాది ముందే చేయడం వల్ల పార్టీకి మైలేజ్ వస్తుందన్నది ఆ పార్టీ ఆలోచన. అందుకే పార్లమెంటు సమావేశాల చివరి రోజున స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖను నేరుగా స్పీకర్ కు ఇవ్వాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించారు. అంటే రాజీనామాలను వెంటనే ఆమోదించుకునేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి మరోసారి విమర్శలు ఎదుర్కొనకుండా నేరుగా స్పీకర్ ఫార్మాట్ లోనే స్పీకర్ కే రాజీనామాలు ఇవ్వాలన్నది జగన్ తాజా నిర్ణయం.
చంద్రాబాబుపై విమర్శలు....
ఇలా పాదయాత్రలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, ఊహించని హామీలను గుప్పిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో మహిళ సదస్సులు, మైనారిటీ సదస్సులు, రైతు సమావేశాలు నిర్వహిస్తూ వారికి ఊరట కల్గించే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకూ నిరంతరం పోరాటం చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, ప్రత్యేక హోదా కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని జగన్ విమర్శించారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్....
జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతోంది. ఉదయగిరి నియోజకవర్గం లోని కొండాపురం లో బస ప్రాంతం నుంచి ఈరోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. కొండాపురం నుంచి ఆదిమూర్తిపురం, తూర్పు ఎర్రబల్లి క్రాస్ రోడ్స్, రేణుమల్ల వరకూ సాగుతుంది. మధ్యాహ్న భోజనం ముగించుకున్న తర్వాతరేనమాళకు చేరుకుంటారు. రేనమాళలో ఏర్పాటు చేసిన మహిళాసదస్సులో జగన్మోహనరెడ్డి పాల్గొననున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తూర్పుపాలెం క్రాస్ రోడ్స్ వరకూ యాత్ర కొనసాగనుంది.