జగన్ కు పట్టుకున్న కొత్త టెన్షన్

Update: 2017-10-18 06:30 GMT

వైసీపీ అధినేత జగన్ ముహూర్తాలను నమ్ముతున్నారు. పీఠాధిపతులకు పాద నమస్కారం చేస్తున్నారు. మంచి ముహూర్తం కోసమే జగన్ తన పాదయాత్రను అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసుకున్నారన్న ప్రచారం ఉంది. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సలహా మేరకే జగన్ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. అప్పడు రుషికేష్ లో ఉన్న స్వరూపానందేంద్ర స్వామికి ఫోన్ చేసి మరీ మంచి బలమైన ముహూర్తాన్ని పాదయాత్ర కోసం నిర్ణయించాలని కోరారట. ఆయన ఆశీస్సులు కూడా ఫోన్లోనే తీసుకున్న జగన్ తర్వాత చిన జీయర్ స్వామిని స్వయంగా కలిసి ఆయన ఆశీస్సులనూ పొందారు. ఇక ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉంది. ఎంత కష్టపడ్డా ఫలితాలు అనుకూలంగా వస్తాయో? రావో? అన్న అనుమానం వైసీపీ నేతలనూ పట్టి పీడిస్తుంది. అందుకే జగన్ నివాసం, పార్టీ కార్యాలయం ఉన్న లోటస్ పాండ్ లో వాస్తు దోషాలున్నట్లు కొందరు వైసీపీ నేతలు చెప్పడంతో జగన్ కొంత ఆందోళనకు గురయ్యారు.

లోటస్ పాండ్ లో వాస్తు దోషాలా?

వాస్తు పండితులను పిలిపించుకుని మరీ లోటస్ పాండ్ లో ఉన్న దోషాలను గుర్తించాలని కోరారు. దీంతో వాస్తు పండితులు కొన్ని సూచనలు చేశారు. భవన ప్రాంగణంలో కొన్ని మార్పులు చేయాలని చెప్పడంతో లోటస్ పాండ్ లో వాస్తు లోపాలను సవరించే పనిలో పడ్డారు జగన్. ఈ మేరకు లోటస్ పాండ్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నారు. అలాగే జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా వాస్తు దోషాలను పరిశీలించాల్సిందిగా అక్కడి నేతలకు సూచించారు వైసీపీ నేతలు. మొత్తం మీద జగన్ కు వాస్తు భయం పట్టుకుందంటున్నారు. గెలుపు కోసం వచ్చే నెల 2వ తేదీ నుంచి ఆఖరు ప్రయత్నంగా పాదయాత్ర చేస్తున్నారు జగన్. ఇది వర్క్ అవుట్ కాకుంటే ఎలా? అన్న సందేహంతోనే వాస్తు దోషాలను అరికట్టాలని పండితులకు పురమాయించారట జగన్. కేవలం జగన్ కే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం వాస్తును తెగ నమ్మేస్తారు. ఆయన కూడా సచివాలయంలో వాస్తు దోషాలున్నాయని గ్రహించి మూడు గేట్లను ఏర్పాటు చేశారు. సచివాలయం, అసెంబ్లీలో కూడా మార్పులు, చేర్పులు చేయించారు. ఇలా పొలిటికల్ లీడర్లకు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వాస్తు భయం పట్టుకుందన్నమాట.

Similar News