జగన్ అదే ప్రచారం మొదలు పెడితే....?

Update: 2018-01-03 04:30 GMT

ఉద్దానం కిడ్నీ బాధితులు, అగ్రికల్చర్ విద్యార్థుల సమస్యలు, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య ఇలా పవన్ ఏ సమస్య లేవనెత్తిన వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించేవారు. ఇప్పడు పవన్ సరికొత్త సమస్యను బాబు నెత్తిన పెట్టారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ దేశంలో కేసీఆర్ ఆదర్శం గా నిలిచారని ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఫాలో అయ్యి ఇదే ఆలోచన చేయాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇది చంద్రబాబు సర్కార్ కి షాక్ కొట్టించే అంశమే. దీనిని అమలు చేయడం ఆర్ధికంగా నష్టాల్లో ఉండి ప్రధాని అపాయింట్ మెంట్ రెండేళ్లుగా లేక నిధులు అరకొర కేంద్రం నుంచి విడుదల అవుతూ లోటు బడ్జెట్ లో వున్న సర్కార్ కి ఇబ్బంది పెట్టే అంశమే. ఇప్పటికే కేసీఆర్ ఏపీలో కూడా టిడిపి అనుకూల పత్రికల్లో రైతులకు ఇచ్చిన 24 గంటల విద్యుత్ అంశం అధికారపార్టీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్ సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యల్లో ఎపిలోకూడా ఎందుకు ఇవ్వరనడం టిడిపికి పుండు మీద కారం చల్లినట్లు గా వుంది. పవన్ ఈ వ్యాఖ్య హుషారు లో చేసేశారా లేక కావాలనే టిడిపి ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యాఖ్యానించారో అర్ధం కాక తెలుగు తమ్ముళ్లు మధన పడుతున్నారు. కేసీఆర్ ఇస్తున్న ఝలక్ లకు తోడు జనసేనాని వత్తాసు పలకడం టిడిపి కి సమస్యలు తెచ్చి పెడుతుంది.

పవన్ అడిగింది బాబు అమలు చేస్తారా ..?

కేసీఆర్ 24 గంటల విద్యుత్ పధకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని రైతులనుంచి డిమాండ్ బయల్దేరితే సర్కార్ ఇరకాటంలో పడుతుంది. దీనికి తోడు వరాల జల్లు కురిపించుకుంటూ పాదయాత్ర గా ప్రజల్లో వున్న జగన్ ఇదే అంశాన్ని ప్రతి చోటా ప్రస్తావిస్తే టిడిపి సర్కార్ చిక్కులు ఎదుర్కొంటుంది. దీనికి తోడు జన్మభూమి ప్రారంభం అయిన నేపథ్యంలో రైతులు ఈ వినతి పత్రాలు. ఫిర్యాదులుగా ఇస్తే వాటిని విపక్షం ప్రచారం పెద్దఎత్తున చేస్తే మైనస్ లో పడతామని టిడిపి నేతలే ఆఫ్ ది రికార్డ్ లో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు నాణ్యమైన విద్యుత్ అంశాన్ని, భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడుతున్నామనే ప్రచారం టిడిపి ఇప్పటికే తెరపైకి తెచ్చి ముమ్మరంగా ప్రచారం మొదలు పెట్టేసింది. అయినప్పటికీ రైతుల్లో ప్రతిస్పందన ఎలా ఉంటుంది, వారు 24 గంటలు విద్యుత్ కావాలని కేసీఆర్ ను చూసి డిమాండ్ చేస్తారనే భయం తమ్ముళ్ళను వెంటాడుతుంది.

Similar News