ఇళవరసికి ఒక కొడుకున్నాడు. అతడి పేరు వివేక్ జయరామన్. వయసు 27 సంవత్సరాలు. కాని ఆస్తులు మాత్రం వెయ్యి కోట్లకు పైగానే. ఇవీ తమిళనాడులో శశికళ బంధువల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడుల్లో బయటపడుతున్న వాస్తవాలు. మూడు రోజుల పాటు శశికళ, ఆమెకుటుంబం పై జరిపిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో ఒక్క ఇళవరసి కుమారుడు వివేక్ కే వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఐటీశాఖ గుర్తించారు. వివేక్ కు సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శశికళ, ఆమె వదిన ఇళవరసి అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం శశికళతో పాటు ఇళవరసి కూడా అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
వెయ్యి కోట్ల ఆస్తులతో.....
అయితే ఇళవరసి తన ఆస్తులన్నింటినీ కుమారుడిపేరిట పెట్టేయడం విశేషం. వివేక్ జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక, జాస్ సినిమాస్ ఇలా అనేక ఆస్తులకు వివేక్ మాత్రమే యజమానిగా ఉన్నారు. భారీగా ప్రభుత్వానికి ఆదాయపు పన్ను ఎగవేయడంలో కూడా వివేక్ ముందున్నారట. 27 ఏళ్ల వయస్సులోనే వెయ్యి కోట్ల ఆస్తులను, పెట్టుబడులను కూడబెట్టడంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోరు వెళ్లబెట్టారు. దీంతో ఈ కేసు జాబితాలో ఆయన పేరు మొదటి స్థానంలో ఉంది. వివేక్ ను ఇటీవల పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గా నియమించాలని చిన్నమ్మ భావించారు. దినకరన్ ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వచూపిన కేసులో జైలుకు వెళ్లినప్పుడు శశికళ ఈ ఆలోచన చేశారు. అయితే ఇంతలోనే దినకరన్ కు బెయిల్ రావడంతో చిన్నమ్మ ఆలోచన విరమించుకున్నారు. ఇటీవల పెరోల్ పై వచ్చినప్పుడు కూడా శశికళ వివేక్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇలా వివేక్ తన వారసుడిగా చేయాలని శశికళ నిర్ణయించుకున్నారు. తన అన్న కుమారుడు వివేక్ కు ఆస్తులతో పాటు రాజకీయ వారసత్వం కూడా అప్పగించాలని శశికళ భావించారు. అయితే శశికళ ఆశలపై ఐటీ శాఖ నీళ్లు చల్లింది.