చింతమనేని ప్రభాకర్రావు ప్రభుత్వ విప్. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే. ముక్కుసూటి తనం... ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేసే మొండితనం ఆయన సొంతం. పోలీసులను కొట్టాడని, ఎమ్మార్వో వనజాక్షిపై చేయి చేసుకున్నాడని.... మంత్రి పదవి రాలేదని బాబునే తిట్టాడని.. అవసరమైతే సొంత పార్టీ పెడతానని ఇలా ఎన్నో కాంట్రవర్సీ విషయాలు ఆయన చుట్టూ అల్లుకుని ఉంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అనేవాళ్లు ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి...వాళ్ల కోసమే పనిచేయాలని అలా పని చేయని వాళ్లు ఎందుకని ఆయన నేరుగానే ప్రశ్నిస్తారు.
సంక్రాంతికి చింతమనేని సందడి....
ఇక గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాలకు ఫేమస్. తెలుగు సంస్కృతిలో భాగమైన కోడి పందాల నిర్వహణలో చింతమనేనిది అందెవేసిన చేయి. కోడి పందెం వేయడం తప్పు కదా అని ప్రశ్నిస్తే... రెండు కోళ్లు ఎదురుపడితే కలబడుకోవడం కామన్. అది వాటి జాతి లక్షణం.... వాటిని ఎవ్వరూ ఆపలేరు... అది పందెం ఎలా అవ్వుద్దని ఆయన ఎదురు ప్రశ్న వేస్తారు. సంక్రాంతికి చింతమనేని తన పొలంలోనే బరి వేసి మరీ పందేలు నిర్వహిస్తుంటారు.
సరదా అంటున్న ఎమ్మెల్యే....
ఇక్కడ పందెం వేసే ఒక్కో కోడి ఖరీదే అక్షరాలా లక్షరూపాయలు ఉంటుందట. ఈ విషయాన్ని తాజాగా చింతమనేని చెప్పారు. తన వద్ద ఉన్న కోళ్ల రేటు లక్ష ఆ పైమాటే అని ఆయన చెప్పుకొచ్చారు. పందెం వేసే కోడి ఖరీదే రూ. లక్ష ఉంటే ఇక ఆ పందెం ఎన్ని లక్షల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక తనకు కోడి పందేలు అంటే చిన్నప్పటి నుంచే సరదా అన్న ఆయన తన చిన్నతనంలో కోడి రేటు రూ.10 ఉండేదన్నారు.
ఇప్పుడు లక్షల్లో....
ఆ తర్వాత అదే కోడి రేటు రూ. 100, 200, 300, 500, 1000 ఇప్పుడు లక్షలు పలుకుతోందన్నారు. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగానే కోళ్ల రేట్లు కూడా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇక తన పొలంలో వేసే కోడి పందేలకు పేదలను, మధ్యతరగతి వాళ్లను రానివ్వనని కూడా చెప్పారు. ఓ ఎమ్మెల్యేగా పేదవాళ్లను జూదంలో ఎంకరేజ్ చేసేందుకు తాను ఇష్టపడనన్నారు.