గవర్నర్ నరసింహన్ ను పంపిచేస్తారా ...?

Update: 2018-01-05 04:30 GMT

వివాదరహితుడు, దైవభక్తి పరాయణుడు, యుపిఎ ప్రభుత్వ హయాంలో నియమితుడు అయినా ఎన్డీయే ప్రభుత్వాన్ని సైతం మెప్పించిన లౌక్యుడు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఇరు రాష్ట్రాల కమలం పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ తీరును తీవ్రంగా తప్పుపడుతూ తమ అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. నరసింహన్ వ్యవహార శైలి అస్సలు బాలేదని ఇద్దరు ముఖ్యమంత్రులను చీటికీ మాటికీ రప్పించుకుని సమావేశాలు నిర్వహించడంపై తెలంగాణ బిజెపి నేత కిషన్ రెడ్డి కస్సు బస్సు అంటున్నారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీ బిజెపి నేత విష్ణు కుమార్ రాజు గవర్నర్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. గవర్నర్ ఏపీ విషయంలో పక్ష పాత ధోరణి అవలంభిస్తూ బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ లో ఏపీలో ఒకే తరహా బిల్లులు ప్రవేశపెడితే గవర్నర్ అక్కడ తక్షణం ఆమోదం తెలిపి ఏపీ విషయాన్ని పెండింగ్ లో పెట్టడాన్ని విష్ణుకుమార్ రాజు ఎత్తి చూపుతున్నారు.

కేంద్రం మారుస్తుందా ...?

ఇరు రాష్ట్రాల బిజెపి నేతల ఫిర్యాదులపై పార్టీ అధిష్టానం ఏమేరకు పరిగణలోనికి తీసుకుని గవర్నర్ పై చర్య తీసుకుంటున్నది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎపి రీ ఆర్గనైజేషన్ చట్టం లో దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ కి ప్రత్యేక అధికారాలు పదేళ్ళ పాటు ఏపీ తెలంగాణ లో సంక్రమించాయి. తుది నిర్ణయం గవర్నర్ కే చట్టం కల్పించింది. ఇరు రాష్ట్రాల నడుమ ఎలాంటి సమస్య ఎదురైనా గవర్నర్ కల్పించుకుని ఆదేశాలు ఇవ్వొచ్చని విభజన చట్టంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అవసరమైనప్పుడు కూర్చోబెట్టి వివిధ సమస్యలపై గవర్నర్ చర్చిస్తున్నారు. ఈ భేటీలే కమలం నేతల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. గవర్నర్ సాగించే చర్చలు ఏమిటన్నది తెలియక రాజకీయ వర్గాల్లో అయోమయం ఏర్పడుతుంది. సుహృద్భావ వాతావరణంలో ఇరు రాష్ట్రాల సీఎం లు సమావేశం అయ్యారనే మాట తప్ప ఎందుకు ఏమిటి ఎలా అనే అంశాలు ఆయన వివరించకపోవడం తో ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ గ్యాప్ పెరిగి పెద్దదై చివరికి నరసింహన్ ను మార్చేయండి అనే వరకు వెళ్ళింది. మరి బిజెపి అధిష్టానం తమ పార్టీలోని ఇరు రాష్ట్రాల నేతల ఫిర్యాదులను ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి.

Similar News