ఇక్కడ జగన్ కుంపటి పెట్టేశారే...!

Update: 2018-01-10 01:30 GMT

టీడీపీ నేత కుతూహలమ్మకు పట్టున్న నియోజకవర్గంలోకి జగన్ అడుగుపెట్టారు. దాదాపు మూడుదశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన కుతూహలమ్మ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. చిత్తూరు జిల్లాలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా కుతూహలమ్మ సుమారు 11 వేల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోచేరారు. టీడీపీ టక్కెట్ పై 2014లో పోటీ చేసిన కుతూహలమ్మ వైసీపీ అభ్యర్థి నారాయణ స్వామి చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జగన్ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈసారి కూడా గంగాధర నెల్లూరును కైవసం చేసుకుంటామని వైసీపీ అధినేత జగన్ నమ్మకంతో ఉన్నారు.

వైసీపీలో వరుసగా చేరికలు...

పెనుమూరులో టీడీపీనేత మధుసూధన్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన మాజీ మార్కెటింగ్ యార్డు కమిటీ ఛైర్మన్. మధుసూదన్ రెడ్డి రాకతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని, జన్మభూమి సభల పేరుతో దోపిడీకి తెరలేపారని జగన్ దుయ్యబట్టారు. భూమి స్వభావాన్ని నల్లబెల్లం, తెల్లబెల్లం తయారవుతుందని, అయితే నల్లబెల్లంపై ఆంక్షలు విధించడమేంటని జగన్ ప్రశ్నించారు. దీనివల్ల చెరకు ఫ్యాక్టరీలు మూతబడే స్థితికి చేరుకున్నాయన్నారు. గంగాధర నెల్లూరు నియోజవర్గం మంచినీటి ఎద్దడితో అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

చంద్రబాబుపై నిప్పులు...

ముఖ్యమంత్రి చంద్రబాబు నెలకోసారివిదేశాలకు వెళుతున్నది తన వద్ద ఉన్న నల్లధనాన్ని దాచుకోవడానికేనని జగన్ విమర్శించారు. ప్రయివేటు విమానాల్లో విదేశాలకు వెళ్లి నల్లధనాన్ని అక్కడ దాచుకువస్తున్నారన్నారు. అయితే ప్రజలకు మాత్రం పరిశ్రమలను తీసుకురావడానికే తాను విదేశీ పర్యటలను చేస్తున్నట్లు నమ్మబలుకుతున్నారని జగన్ ఆరోపించారు. ఏపీలో విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని మూడేళ్ల నుంచి చెబుతున్నారని, కాని ఇంతవరకూ తగ్గించిన పాపాన పోలేదన్నారు. తగ్గించకపోగా మూడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారన్నారు. టీడీపీ హయాంలో ఇప్పటి వరకూ జరిగిందంతా అవినీతిమయమేన్నారు. ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు కాంట్రాక్టులు, రాజధాని భూములు, దేవాలయభూములను కూడా వదలకుండా అవినీతికి చంద్రబాబు బ్యాచ్ పాల్పడుతుందని ధ్వజమెత్తారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో ఊహించని రీతిలో విజయవంతం అవుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News