ఏం సెటైర్ వేశావులే?

Update: 2018-03-11 01:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ సెటైర్లు వేశారు. ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీ సభ్యులు చంద్రబాబు నటనను చూసి ఉంటే ఖచ్చితంగా ఆయనకు అవార్డు వచ్చి ఉండేదని జగన్ ఎద్దేవా చేశఆరు. ఆస్కార్ అవార్డు ఎంపిక కమిటీ సభ్యులు విదేశాల్లో ఉంటారు కాబట్టి బాబు నాటకాలను వారు చూసి ఉండకపోవచ్చన్నారు. నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తూ చంద్రబాబు అనేక నాటకాలకు తెరతీశారన్నారు. చీరాల క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

బాబు వన్నీ డ్రామాలే....

ప్రత్యేక హోదా వద్దన్నదీ ఆయనే...మళ్లీ కావలంటుందీ ఆయనేనని ఇదంతా తాను చెప్పేది కాదని, ఆయన వ్యాఖ్యలను మీడియాలో మీరే చూశారన్నారు. ఎన్నికలు జరగబోతున్న సమయంలో ప్రత్యేకహోదా నినాదం అందుకున్నారన్నారు. చంద్రబాబు మూడేళ్ల ముందే మేలుకుని ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదని, రాష్ట్రం అభివృద్ధి చెందేదని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ ఈ సందర్భంగా స్థానిక సమస్యలను గురించి కూడా ప్రస్తావించారు. కొమ్ముమూరు కాల్వ ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయని, వైఎస్ ప్రారంభించిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేకపోయారన్నారు. చేనేత కార్మికుల గోడును చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.

నేటి ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్....

జగన్ ప్రజాసంకల్ప యాత్ర 109వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం జగన్ పాదయాత్ర చీరాల నుంచి ప్రారంభం కానుంది. చీరాలలో జగన్ బసచేసిన ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కొత్తపేట, ఆంధ్రకేసరి జూనియర్ కళాశాల, బాలాజీ థియేటర్, పేరాల, ఐటీసీ, ఆదినారాయణపురం చేరుకుంటారు. అక్కడ జగన్ భోజన విరామానికి ఆగుతారు. అక్కడి ఈపూరుపాలెం వరకూ ప్రజాసంకల్ప పాదయాత్ర జరగనుంది.

Similar News