సంచలనం రేపిన ఎంసెట్ స్కామ్ కేసు ఇప్పటి వరకూ ఏమీ తేల్చలేదు. లీకు వీరులెవ్వరో కనిపెట్టలేకపోయింది. ఇందుకు బాధ్యులైన అధికారులను కూడా గుర్తించలేకపోయింది. ఎంసెట్ స్కామ్ జరిగి ఏడాది గడుస్తున్నా ఇందులో ప్రదాన పాత్ర ఎవరదనేది ఇంతవరకూ నిర్ధారించలేకపోయింది. ఎంసెట్ పేపర్ లీకేజీని ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. అయితే సీఐడీ దర్యాప్తులో బ్రోకర్లను, కోచింగ్ సెంటర్ల యజమానులను 81 మందిని అరెస్ట్ చేసింది. వారిలో చాలా మంది ఇప్పటికే బెయిల్ పై బయటకు వెళ్లిపోయారు. అయితే ఈ లీకేజీకి ఎవరు కారణమనేది ఇంతవరకూ తేల్చి చెప్పలేకపోయింది సీఐడీ. ఇందులో చాలా మంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నా... వాటిపై సీఐడీ దృష్టి సారించకపోవడంతో విమర్శలు పెద్దయెత్తున విన్పిస్తున్నాయి.
అసలు నిందితుడు ఎవరు?
మళ్లీ ఎంసెట్ పరీక్ష దగ్గరపడుతోంది. ఈ సమయంలో జేఎన్టీయూ అధికారులకు సీఐడీ తాజాగా నోటీసులు ఇచ్చింది. ఎంసెట్ లీకేజీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కీలక నిందితుడా భావించిన కమలేశ్వర్ సింగ్ పోలీసు కస్టడీలోనే మృతి చెందడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ప్రశ్నాపత్రం తయారీలో ఏ ఏ అధికారి ఉన్నారు? ఎక్కడ తయారు చేశారు? ఎవరి ఆధ్వర్యంలో ప్రింటింగ్ ప్రెస్ కు అప్పగించారు? అన్న విషయాలను ఇన్ని రోజులకు కనుగొనేందుకు జేఎన్టీయూ అధికారులకు నోటీసులు లిచ్చింది సీఐడీ. దీంతో ఈ లీకేజీకి, జేఎన్టీయూ అధికారులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. అయితే అసలు నిందితులెవరో ఇప్పటి వరకూ సీఐడీ తేల్చకపోవడాన్ని తల్లిదండ్రులు సయితం తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా అసలు నిందితులను గుర్తించాలని వారు కోరుతున్నారు.