త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ను చూశాం. ఆయన సాదాసీదా జీవితాన్ని గడుపుతారు. అదే జీవితాన్ని ఆయన కోరుకుంటారు. ముఖ్యమంత్రిగా కొన్నేళ్ల పాటు పనిచేసినా ఆయన తీరులో మార్పు ఉండదు. ఆయన సామాన్య జీవితం చూస్తే ఎవరైనా అబ్బురపడాల్సిందే.ఇలాంటి వాళ్లు ఉంటారా? అన్న అనుమానం కూడా తలెత్తుంది. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వార్తల్లోకెక్కారు. ఇటీవలే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్రసింగ్ రావత్ పదవిని చేపట్టారు. అయితే ఆయన పెట్టిన ఖర్చు చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే.
కేవలం పది నెలల్లో.....
గత ఏడాది మార్చి 18వ తేదీన ముఖ్యమంత్రిగా రావత్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆయన చిరుతిండి ఖర్చు ఏకంగా 68 లక్షల రూపాయలు దాటింది. ప్రజాధనాన్ని ఇంత విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఒక సామాన్యుడు సమాచార హక్కు చట్టం కింద సేకరించారు. కేవలం పదినెలల్లో త్రివేంద్ర సింగ్ రావత్ టీ, టిఫిన్లకు 68 లక్షలు ఖర్చయినట్లు తేల్చారు. సమాచార హక్కు చట్టం కార్యకర్త హేమంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆ రాష్ట్ర సచివాలయం ఈ వివరాలను పంపింది. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే టీ నీళ్ల ఖర్చు 68 లక్షలు పదినెలల్లో దాటింది.
ప్రజా దర్బార్ ఉందని....
త్రివేంద్ర సింగ్ రావత్ ప్రతి రోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటారని, సమీక్షలు, సమావేశాలు అధికారులతో నిర్వహిస్తుంటారని ఉత్తరాఖండ్ సచివాలయం అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. వచ్చిన అతిథులకు కోసం టీ, బిస్కెట్ల కోసమే ఈ ఖర్చు జరిగిందని వివరించారు. అంతే తప్ప ముఖ్యమంత్రి సొంతం కోసం ఈ నిధులను వినియోగించలేదని కూడా పేర్కొంది. అయితే ప్రజాదర్బార్ నిర్వహించడంలో తప్పు లేదని, అయితే కేవలం టీ ఖర్చుల కోసం ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తగదని నెటిజెన్లు తప్పు పడుతున్నారు. ఇప్పుడు సీఎం రావత్ టీ ఖర్చు వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.