ఈ ఏపీ మంత్రి మౌనముద్రను ఎందుకు దాల్చారు?

Update: 2017-10-18 08:30 GMT

ఈ మంత్రి గారు పెద్దగా కన్పించడం లేదు. సొంత జిల్లాలో..... సొంత పార్టీ నేతలే తనపై అసమ్మతితో ఉండటం వల్లనే మంత్రిగారు పెద్దగా జిల్లాలోనూ పర్యటించడం లేదు. ఆయన తన సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆయనే మంత్రి సుజయ కృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సుజయ కృష్ణ రంగారావు వైసీపీలో గ్రూపుల పోరు పడలేక... ఆధిపత్యాన్ని తట్టుకోలేక టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయన చేరికను కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వ్యతిరేకించినా సుజయ కృష్ణ రంగారావును చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకోవడమే కాకుండా మంత్రిపదవిని కూడా ఇచ్చారు. ఇది మిగిలిన ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. అందుకే మంత్రి జిల్లాకు వచ్చినా ఎమ్మెల్యేలు ఎవరూ మంత్రిని కలుసుకునేందుకు రావడం లేదు. నిన్న గాక మొన్న వచ్చి మంత్రి పదవిని దక్కించుకున్నారన్న అసూయ చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. అంతేకాదు ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత లేదు. అయితే మంత్రిగా అందిరినీ సమన్వయం చేసుకుని వెళ్లాల్సిన సుజయ కృష్ణారంగారావు జిల్లాలో చేతులెత్తేసినట్లే కన్పిస్తోంది.

క్యాడర్ కూడా పట్టించుకోవడం లేదే.....

వైసీపీలో గ్రూపుల గొడవ ఉందని టీడీపీలోకి వస్తే ఇక్కడ కూడా అదే సమస్య తలెత్తుంది. ఎమ్మెల్యేలు కోళ్ల అప్పలనాయుడు, మీసాల గీత, కెఎనాయుడు వంటి వారు అసలు మంత్రిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ ఇన్ ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పెత్తనమే ఎక్కువగా కొనసాగుతుంది. ఇన్ ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరం వచ్చారంటే వెంటనే వాలిపోయే ఎమ్మెల్యేలు అదే జిల్లాకు చెందిన మంత్రి సుజయకృష్ణ రంగారావు వస్తున్నారంటే పట్టించుకోవడం మానేశారు. అంతేకాదు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు ఎక్కువగా మంత్రి గంటా శ్రీనివాసరావునే ఆహ్వానించడానికి ఎమ్మెల్యేలు ఎక్కువగా తాపత్రయ పడుతున్నారు. ఎమ్మెల్యేలను చూసి పార్టీ క్యాడర్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో రాజుగారు మనస్థాపానికి గురయినట్లు తెలుస్తోంది. అందువల్లనే ఆయన ఎక్కువగా తన నియోజకవర్గానికే పరిమితమయినట్లు సమాచారం. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నది ఆయన అంతరంగం. అందుకే మౌనంగా రంగారావు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారట.

Similar News