ఈరోజు ఏపీలో విచిత్ర పరిణామంచోటు చేసుకుంటోంది. జగన్ సొంత ప్రాంతమైన కడపజిల్లా పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఆయన జన్మభూమి రెండో రోజు జరిగే కార్యక్రమాల్లో పులివెందుల్లో జరిగే బహిరంగ సభలో బాబు ప్రసంగించనున్నారు. ఇందుకోసం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల వైసీపీ అధినేత సొంతగడ్డ కావడంతో బాబు సభకు పెద్దయెత్తున జిల్లా నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
జగన్ చేయిపట్టుకుని నడిచిన ఎస్సై....
ఇక వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో పర్యటిస్తున్నారు. జగన్ ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 51వ రోజుకు చేరుకున్న జగన్ యాత్ర ఈరోజు చింతపర్తి, పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయినపల్లి, డెకలకొండ, కలికిరి వరకూ కొనసాగుతుంది. అయితే జగన్ పాదయాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఓ సంఘటన జరిగింది. రొంచిర్ల ఎస్సై నాగార్జున రెడ్డి జగన్ చేయి పట్టుకుని పాదయాత్రలో ఈరోజు నడవటం చర్చనీయాంశమైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఒక డివిజన్ స్థాయి అధికారి కూడా జగన్ తో రహస్యంగా చర్చలు జరిపినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టే అవకాశముంది.