ఒక జాతీయ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఆపరేషన్ కోసం 4,800కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయిందని ప్రత్యేక హోదా సాధన సమితి నేత, సినీనటుడు శివాజీ ఆరోపించారు. ఇప్పటికే ఈ మొత్తంలో కొంత తరలించారన్నారు. దక్షిణాది రాష్ఠ్రాల ఆపరేషన్ పేరు ద్రవిడ అని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో ఆపరేషన్ పేరు కుమార అని, ఏపీ ఆపరేషన్ పేరు గరుడ అని చెప్పారు. కేరళ, తమిళనాడులో ఆపరేషన్ రావణగా చేపట్టారన్నారు. తనకు ఆ పార్టీలోని కీలక వ్యక్తులే సమాచారం అందించారని చెప్పారు. మనలో ఉన్న అనైక్యతను వాళ్లు వాడుకుంటున్నారన్నారు. తనకున్న సమాచారం ప్రకారం రేపు లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ జరుగుతుందని, ఆరుగురు మంత్రులు ఏపీకి చేసిన సాయంపై సభకు వివరిస్తారని తెలిపారు. ఆపరేషన్ లో ఒక రాజ్యేంగేతర శక్తి ఉన్నారన్నారు శివాజీ. ప్రతి రాష్ట్రంలో ఆపరేషన్ తీరు మారుతుందని, కంటెంట్ మాత్రం అదేనని అన్నారు. పరోక్షంగా బీజేపీపైనే శివాజీ విమర్శలు చేసినట్లు కన్పిస్తోంది.