ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది.. డీఎంకేకు 2జీ స్పెక్ట్రం కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు ఓ స్పెషల్ తీర్పు ఇచ్చేసింది.ఇంకేం స్టాలిన్ వర్గాలు పండుగ చేసుకుంటున్న సందర్భంలోనే నవ్యాంధ్రలోనూ ఇలాంటి వాతావరణమే ఒకటి నెలకొంది. ఎందుకంటే ఇవాళ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ జన్మదినం.. కనుక ఇన్నాళ్లుగా అక్రమాస్తుల కేసుల్లో కోర్టుల చుట్టూ వాయిదాల పేరిట తిరుగుతున్న యువనేతకు ఇది ఓ ఊరట.. రేపటి వేళ తనపై నమోదయిన పది కిపైగా సీబీఐ కేసులన్నీ కొట్టుకుపోతాయని భావిస్తున్నారు వైసీపీ నేతలు. ఏమంటే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసు కొట్టివేయడమైంది అని కూడా అనొచ్చు.
వేల కోట్ల స్కాం కూడా...
సో.. జగన్ కు తప్పక కోర్టు క్లియరెన్స్ ఇచ్చే సమయంఅతి త్వరలోనే రానుంది. రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం కాంగీయులకు ఎంత చెడ్డపేరు తెచ్చిందో.. సోనియా హయాంలో యూపీఏ సర్కార్ టైంలో డీఎంకే నేతలు చేసిన ఈ కుంభకోణం కూడా అంతే స్థాయిలో హస్తం పార్టీ కొంపముంచింది. నాటి కుంభకోణం విలువ 67 కోట్ల రూపాయలు అయితే నేటి స్కాం విలువ కొన్ని వేల కోట్ల రూపాయల పైమాటే! నాటి మంత్రులు దయానిధి మారన్, రాజా ఈ కేసులో కీలకంగా వ్యవహరించి సొమ్ములు ఇంటిదారి పట్టించారన్న ఆరోపణలు విన్పించాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ నిందితులకు చెందిన ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను జప్తు చేసింది. ఈ కుంభకోణం ఫలితంగానే తమిళనాట డీఎంకే ఘోరంగా పతనమైంది.
ఎవరీ మారన్ ??
దయానిధి మారన్, కళానిధిమారన్ వీరు కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్ (దివంగత నేత) కుమారులు.డీఎంకే అధినేత కరుణానిధి మనుమలు. పార్టీకి సంబంధించి అన్ని పనుల్లోనూ తాతకు సాయంగా ఉండేవారు. ఓవిధంగా చెప్పాలంటే ఆయనకు కుడి భుజంగా వ్యవహరిం చేవారు. కరుణానిధికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారే అళగిరి, స్టాలిన్, కనిమొళి. అప్పట్లో వీరు చిన్నపిల్లలు కావడంతో అన్ని పనులకూ మురసోలీ మారన్ పై నే కరుణ ఆధారపడేవారు. ఇక ఇద్దరు కుమారులకూ మధ్య అనేకానేక విభేదాలున్నాయి. స్టాలిన్ కడు సమర్ధుడని పేరు. మధురై పరిసర ప్రాంతాల్లో అళగిరికి పట్టు. ఇక దయానిధి మారన్ చెన్నయ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2004,2009ల్లో చెన్నయ్ సెంట్రల్ నియోజక వర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయనకు కమ్యూనికేషన్ల రంగంపై మంచి పట్టు ఉంది.ఈ కారణంగానే నాటి స్పెక్ట్రం కుంభకోణానికి తెరలేపారన్న విమర్శలు విన్పించాయి. అయితే టూ జీ స్కామ్ ఏమీ లేదనితేలిపోవడంతో ఇక జగన్ శిబిరంకూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. జగన్ పై కేసులు కూడా పూర్తిగా మాఫీ అయి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.