అద్దంకి తిరిగి జగన్ కు అచ్చొస్తుందా?

Update: 2018-03-04 01:30 GMT

అచ్చొచ్చిన నియోజకవర్గం. గత ఎన్నికల్లో కైవసం చేసుకున్నా టీడీపీ మధ్యలో ఎగరేసుకుపోయింది. అద్దంకి నియోజకవర్గం. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి ప్రజలు ఓట్లేసి గెలపించినా గొట్టిపాటి పార్టీ మారడంతో ఇక్కడ వైసీపికి కొంత కష్టంగా మారింది. అందుకోసం జగన్ ఈ నియోజకవర్గంలో పాదయాత్రను చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర నేడు ప్రవేశించనుంది. ఇందుకోసం వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

అందరినీ ఆదరించిన....

అద్దంకి నియోజకవర్గం 1955లో ఏర్పడింది. మొత్తం 13 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఐదు సార్లు కాంగ్రెస్ గెలవగా, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు రెండుసార్లు విజయం సాధించారు. అన్ని పార్టీలకూ ఈ నియోజకవర్గం ఆదరించింది. బాచిన చెంచుగరటయ్య రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందడం విశేషం. అదే గరటయ్య టీడీపీ అభ్యర్థిగా ఒకసారి విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గట్టి ఓటు బ్యాంకు ఉండేది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పుడు వైసీపీకి టర్న్ అయింది.

రెండు కుటుంబాలదే ఆధిపత్యం....

ఇక అద్దంకి నియోజకవర్గం అంటేనే రెండు కుటుంబాలు గుర్తుకొస్తాయి. కరణం, గొట్టిపాటి కుటుంబాలదే ఇక్కడ ఆధిపత్యం. రెండు పార్టీలు వేర్వేరు పార్టీల్లో మొన్నటి వరకూ ఉండేవి. కాని ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాంలు తెలుగుదేశం పార్టీలోనే ఉండటం విశేషం. ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎమ్మెల్సీగా నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. దీంతో వీరిద్దరికి ప్రత్యామ్నాయంగా మరో నేతను ఇక్కడ వైసీపీ తయారు చేసుకోవాల్సి ఉంది. గొట్టిపాటి కుటుంబం నుంచే మరొకరిని ఇక్కడ రంగంలోకి దింపాలన్నది జగన్ యోచన.

నేటి పాదయాత్ర షెడ్యూల్....

జగన్ ప్రజాసంకల్ప పాదయత్ర నేటికి 103వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం వైస్ జగన్ దర్శి నియోజకవర్గంలో బస చేసిన ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. తాళ్లూరు శివారు ప్రాంతం నుంచి బయలుదేరే పాదయాత్ర రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్ కాలనీ, పార్వతీ పురం క్రాస్ రోడ్స్, తిమ్మయ్య పాలెం మీదుగా అద్దంకికి జగన్ పాదయాత్ర చేరుకోనుంది. జగన్ రాత్రికి అద్దంకిలోనే బస చేయనున్నారు.

Similar News