వైసీపీ ఎంపీలు గత గత నెల 6వ తేదీన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయనందుకు నిరసనగా వైసీపీకి చెందిన ఐదుగురు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు. అయితే నెలరోజులు గడిచినా వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదు. అయితే కొద్దిసేపటి క్రితం చంద్రబాబు వైసీపీ ఎంపీల రాజీనామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ జూన్ రెండో తేదీ తర్వాత ఆమోదించే అవకాశముందని శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు చెప్పారు. తనకు అందుతున్న సమాచారం మేరకు వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారని, రాష్ట్రంలో ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆయన నేతలకు చెప్పారు. ఉపఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలన్నారు. గతంలో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే టీడీపీ ఏడు స్థానాలను గెలుచుకుందన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. బెంగళూరు లో ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబుపై దాడిచేసింది కూడా వైసీపీ నేతలేనని, బీజేపీ, వైసీపీలు కలసి రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయాలన్నింటినీ పెద్దయెత్తున ప్రచారం చేయాలని బాబు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ భారతదేశంలో తగ్గిపోతుందన్నారు.