జగన్ లెక్క జగన్ కుందట....!

Update: 2018-07-24 03:30 GMT

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతి పార్టీ తమ సొంత రాజకీయ లబ్ది అనే అంశంపైనే కసరత్తు చేస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాలు అమలు చేయాలనే డిమాండ్ పై లోపల ఎలా వున్నా బయట మాత్రం అన్ని పక్షాలు బంద్ లు రాస్తారోకో లు నిరసనలు మూకుమ్ముడిగా చేపట్టాయి. తాజాగా వైసిపి ఇచ్చిన బంద్ పిలుపులో ప్రస్తుతం అధికార టిడిపి ఎప్పటిలాగే వ్యతిరేకించింది. జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం లు దూరంగా ఉంటున్నట్లు చేసిన ప్రకటన వెనుక ఎవరి దారి వారే చూసుకోవాలనే తీరు స్పష్టం అయ్యింది. అయితే వైసిపి కూడా అదే కోరుకుంటుంది. అన్ని పక్షాలు బంద్ లో పాల్గొంటే ఎవరికీ క్రెడిట్ దక్కడం లేదని కనుక నిరసన లబ్ది తమ ఖాతాలోకే పోవాలనే భావిస్తుంది.

జగన్ అందుకే ఏకపక్షంగా ....

లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ పూర్తి అయిన తరువాత రోజు జగన్ ఉదయాన్నే మీడియా సమావేశం పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. దీనికి నిరసనగా మంగళవారం వైసిపి ఒకరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ కి పిలుపు ఇస్తున్నట్లు ప్రకటించారు జగన్. వాస్తవానికి రాష్ట్ర బంద్ వంటి కీలక నిర్ణయాలు ప్రకటించేముందు ఇదే అంశంపై ఒకే అభిప్రాయంతో పోరాడుతున్న ఏ పార్టీని వైసిపి పరిగణలోనికి తీసుకోలేదు. వారితో చర్చించలేదు.

గతంలో కలసి.....

గతంలో వైసిపి ఇచ్చిన పిలుపులో అన్ని పక్షాలు కలిసిపోయాయి. టిడిపి నాయకులు సైతం పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపి ప్రజల్లో చెడ్డ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఈసారి జగన్ తన రాజకీయ ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా నిరసన కార్యక్రమాన్ని మరోసారి ప్రకటించారు. ఆయన వేసిన వ్యూహంపై తర్జన భర్జన పడ్డ కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్ట్ లు దీనికి దూరంగా ఉండాలనే నిర్ణయించడం ఎవరి జండా వారే మోసుకుంటూ వచ్చే ఎన్నికల వరకు తిరగాలన్న లక్ష్యమే ఎజెండాగా నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతుంది.

Similar News