జగ్గంపేట సభలో వైసిపి చీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు అధికార తెలుగుదేశాన్ని, జనసేన కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. కాపు రిజర్వేషన్ అంశంపై రెండు పార్టీలు ప్రజలకు స్పష్టమైన వైఖరి ఇవ్వక తప్పని పరిస్థితి ని జగన్ కల్పించారు. టిడిపి కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నాలుగేళ్ళు గా అమలు చేయాలకేకపోవడం తో ఇప్పుడు దీనికోసం పోరాడుతున్నామని చెప్పినా చట్టబద్ధ హామీలనే కేంద్రం తో అమలు చేయించలేక చతికిల పడే పరిస్థితిలో ఆ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో నమ్మే పరిస్థితిలో లేదు. దాంతో వారంతా జనసేన వైపే చూస్తున్నారు. కానీ జనసేన కాపు రిజర్వేషన్లు అంశంపై పూర్తి స్పష్టత ఇప్పటిదాకా ఇవ్వలేదు. టిడిపి ని అయితే నిందించింది కానీ తాము ఏమి చేస్తామో చెప్పలేదు. ఆగస్టు లో జనసేన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తామన్న పవన్ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, మరికొద్ది రోజుల్లో దీనిపై ఆ పార్టీ తన విధానం విస్పష్టంగా ప్రకటించక తప్పదు.
అంగీకరించేది లేదన్న బిసి సంఘాలు ...
కాపులకు రిజర్వేషన్ ఇస్తే తీవ్ర పరిణామాలంటూ బిసి సంఘాలు ఎప్పటి నుంచో ఏపీలో ఆగ్రహంతో రగిలిపోతూ వస్తున్నాయి. హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే తమకు బిసిలకు వున్న రిజర్వేషన్ నుంచి ఇచ్చే కోటా కోరడం లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వంటివారు ప్రకటించినా బిసిల ఆగ్రహం చల్లారలేదు. సుప్రీం కోర్టు స్పష్టంగా ఈ అంశంపై తేల్చి చెప్పాకా రాజ్యాంగం లోని 9 వ షెడ్యూల్ సవరించాలని స్పష్టం చేస్తున్నా టిడిపి ఓటు బ్యాంక్ రాజకీయంతో కాపులను గత ఎన్నికల్లో కరివేపాకు చేసిందని వైసిపి ప్రచారం చేసింది.
సున్నిత అంశంపై......
జనసేన సైతం ఇస్తామంటే ఇవ్వాలని ఇవ్వడం సాధ్యం కాకపోతే లేదని తేల్చాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో వైసిపి ఈ సున్నిత అంశంలో కీలక నిర్ణయం తీసుకుని తన వైఖరి కుండబద్ధలు కొట్టేసింది . తద్వారా అటు టిడిపి, ఇటు జనసేనలను ఇరకాటంలోకి నెట్టింది. వారిద్దరూ వైసిపి ప్రకటనపై, పైకి ఎన్ని విమర్శలు చేసినా లోపల మాత్రం బిసి ఓటు బ్యాంక్ దూరం అవుతుందనే ఆందోళన తో వున్నారని అంటున్నారు విశ్లేషకులు.