భారతికి భారీ జీతం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. తెలుగుదేశం మీడియాలో భారతికి భారీ జీతం అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. జీతం ఎవరిస్తారు? కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో జీతం నిర్ణయిస్తారు? భారతికి ప్రభుత్వం ఏమైనా జీతం ఇస్తుందా? అని అంబటి ప్రశ్నించారు. హెరిటేజ్ లో ఎన్ని కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలుసునన్నారు. హెరిటేజ్ ను ఫ్యూచర్ గ్రూప్ కు అమ్మినప్పుడు ఎంత లాభం పొందారో బయటపెట్టాలన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో కొందరు తెలుగుదేశం సానుభూతిపరులు, చంద్రబాబుకు అనుకూలరు ఉండటం వల్లనే భారతిపై కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో రాజకీయమైన కుట్ర జరుగుతుందన్నారు.
జగన్ పై బురద జల్లుతూ......
భారతిపై బురద జల్లే కార్యక్రమాన్ని ఇకనైనా మానుకోవాలన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చూపించి వచ్చే ఎన్నికల్లో గెలవాలని అనుకోవడం లేదని, జగన్ మోహన్ రెడ్డిపై బురద జల్లుతూ లబ్దిపొందాలని చూస్తున్నారు. తునిలో జరిగిన రైలుదగ్దం ఘటన యనమల అనుయాయులే చేశారన్నారు. బీజేపీతో తాము కుమ్కక్కయితే తమ అధినేత జగన్ పై ఇన్ని కేసులు ఎందుకు నమోదవుతాయన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు తిరగాల్సి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమ విజయం తమదేనన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి బతుకుతున్న వ్యక్తి చంద్రబాబు అని ఆయన దుయ్యబట్టారు.