ప్రియాంకగాంధీ బలవంతంగా రూ.2 కోట్లకు పెయింటింగ్‌ను అంటగట్టారు: రాణా కపూర్‌

రూ.5050 కోట్ల సొమ్మును అక్రమంగా దేశం దాటించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా కపూర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు ఇచ్చిన

Update: 2022-04-24 05:13 GMT

న్యూ ఢిల్లీ : ఎంఎఫ్‌ హుస్సేన్‌ వేసిన రాజీవ్‌గాంధీ పెయింటింగ్‌ను కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ తనకు బలవంతంగా రూ.2 కోట్లకు అంటగట్టారని ఎస్‌బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ ఆరోపించారు. ఆ రూ.2 కోట్ల మొత్తాన్ని అమెరికాలో సోనియాగాంధీ వైద్య ఖర్చులకు వినియోగించినట్లు కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దేవ్‌రా చెప్పారని తెలిపారు.

రూ.5050 కోట్ల సొమ్మును అక్రమంగా దేశం దాటించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా కపూర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈడీ చార్జిషీట్‌లో పెయింటింగ్‌ విషయాన్ని పొందుపరిచారు. మొత్తం కుంభకోణం విలువ రూ.5050 కోట్లని తేల్చారు. ప్రియాంకకు చెల్లించిన రూ.2 కోట్లను కూడా కుంభకోణానికి సంబంధించిన సొమ్ముగానే ఈడీ భావిస్తోంది. 2010లో కేంద్ర పెట్రోలియం మంత్రిగా ఉన్న మురళీ దేవ్‌రా తనను ఢిల్లీలోని అధికార నివాసానికి పిలిపించారని రాణా కపూర్‌ వెల్లడించారు.
రూ.2 కోట్లు చెక్‌ రూపంలో ప్రియాంక పేరు మీద చెల్లించి, పెయింటింగ్‌ కొనుగోలు చేయాలని ఆదేశించారన్నారు. చెల్లించకపోతే అప్పటికే ప్రకటించిన పద్మవిభూషణ్‌ అవార్డును తీసుకోలేరని, తనతో గానీ, సోనియాగాంధీ కుటుంబంతో కానీ సత్సంబంధాలు ఉండవని మురళీ దేవ్‌రా హెచ్చరించారని వెల్లడించారు.1985లో కాంగ్రెస్‌ వందేళ్ల వేడుక వేదిక మీద రాజీవ్‌గాంధీకి ఎంఎఫ్‌ హుస్సేన్‌ బహూకరించిన ఈ చిత్రం ప్రియాంకగాంధీ దగ్గర ఉందని, తనకు పెయింటింగ్‌లు కొనే అలవాటు లేకపోయినా మురళీ దేవ్‌రా బెదిరింపుల వల్ల కొన్నానని చెప్పారు.
ప్రియాంక రసీదు కూడా ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకు మురళీ తనయుడు మిలింద్‌ దేవ్‌రా రూ.2 కోట్ల మొత్తాన్ని సోనియా ఆసుపత్రి ఖర్చులకు పెట్టినట్లు వెల్లడించారని తెలిపారు. అదే విషయాన్ని అహ్మద్‌ పటేల్‌ ధ్రువీకరించి, సోనియా కుటుంబానికి సహాయపడినందుకు ప్రశంసించారని చెప్పారు.


Tags:    

Similar News