బ్రేకింగ్ : హత్యాయత్నం కేసులో పురోగతి

Update: 2018-10-26 11:03 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో పురోగతి సాధించామని విశాఖపట్నం సీపీ మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... నిందితుడు ఎయిర్ పోర్టులో ఇతర సామాగ్రితో కలిపి కత్తిని రెస్టారెంట్ కి తీసుకొచ్చాడని తెలిపారు. నిందితుడి వద్ద దొరికిన ఉత్తరంలో 9వ పేజీని ఆయన బాబాయి కూతురు జే.విజయలక్ష్మీ(16)తో ఇటీవల ఊరికి వెళ్లినప్పుడు రాయించాడని వివరించారు. మరో పేజీని రెస్టారేంట్ లో పనిచేసే తోటి ఉద్యోగి రేవతీపతి(19)తో రెండు రోజుల క్రితం రాయించాడని తెలిపారు. రేవతిపతిది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలి గ్రామమని తెలిపారు. అతడు 10వ తరగతి చదివి అటెండర్ గా రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. రెండు రోజుల క్రితమే అతడితోనే జిరాక్స్ తెప్పించాడన్నారు.

నాలుగు నెలలుగానే పని...

నిందితుడి వద్ద ఉన్న కత్తిని అప్పుడప్పుడు రెస్టారెంట్ లో పండ్లు కోయడానికి ఉపయోగించేవాడని తెలిపారు. నిందితుడి వద్ద మరో చిన్న కత్తి కూడా దొరికిందని వివరించారు. రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ స్టేట్ మెంట్ తీసుకున్నామని, నిందితుడు శ్రీనివాసరావును రిమాండ్ కి పంపించనున్నట్లు తెలిపారు. కాగా, నిందితుడు నాలుగు నెలలుగానే రెస్టారెంట్ లో పనిచేస్తున్నారని సీపీ వివరించారు. అయితే, నిన్న పలు మీడియా ఛానళ్లతో రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ మాట్లాడుతూ.. నిందితుడు ఎనిమిది నెలలుగా తమవద్ద పనిచేస్తున్నాడని చెప్పడం గమనార్హం.

Similar News