తెలంగాణ జన సమితి పార్టీ ఎన్నికల గుర్తును ఆ పార్టీ అధినేత ప్రొ.కోదండరాం ప్రకటించారు. తమ పార్టీకి ‘అగ్గిపెట్టే’ గుర్తు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లో పెనుమార్పుల కోసం టీజేఎస్ కృషి చేస్తుందన్నారు. పొత్తుల అంశం ఆలస్యం అవడం కొంత నష్టం చేసిందని, అయితే, దీపావళి నాటికి ఒక కొలిక్కి వచ్చి అభ్యర్థుల ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, అయితే, ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి నిలబెట్టే బాధ్యత టీజేఎస్ పై ఉందని అన్నారు. సీపీఐ అనేక ఉద్యమాల్లో తమతో కలిసి పనిచేసిందని, వారి సమస్యలు కూడా పరిష్కారమై కూటమిలో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.