జగన్ సీరియస్... అంతా హైదరాబాద్ లోనే

ఒక ఎమ్మెల్సీ అధికార వైసీపీ ఓటమి వెనక చాలా తంతంగం జరిగిందంటున్నారు. జగన్ కూడా దీనిపై సీరియస్ గానే ఉన్నారని తెలిసింది

Update: 2023-03-24 04:58 GMT

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ అధికార వైసీపీ ఓటమి వెనక చాలా తంతంగం జరిగిందంటున్నారు. జగన్ కూడా దీనిపై సీరియస్ గానే ఉన్నారని తెలిసింది. బాధ్యులైన వారిని గుర్తించిన నేతలు వారి పేర్లను కూడా జగన్ కు వివరించినట్లు చెబుతున్నారు. అయితే చర్యలు ఎప్పుడు తీసుకుంటారన్నది ఇంకా తేలకున్నా వారికి సరైన సమయంలో గుణపాఠం చెప్పేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగానే ఈ కుట్ర జరిగినట్లు వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ ముఖ్యులు మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు.

తొలి నుంచి...
జగన్ ప్రభుత్వంలో తొలి నుంచి ఇంటలిజెన్స్ శాఖ పెద్దగా పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. ఆ శాఖకు చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను తేవాలని జగన్ తొలుత భావించినా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ప్రస్తుతమున్న సీతారామాంజనేయుులు కూడా ఆషామాషీ అధికారి కాదు. ఆయనకు ఇలాంటి విషయాలను పసిగట్టడంలో కొట్టిన పిండి. రాష్ట్రంలో ఏమాత్రం చడీ చప్పడు లేకుండా తంతు అంతా పొరుగు రాష్ట్రాల్లో ముగిసేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. తాను ఉండవల్లిలోనే ఉంటే ఇంటలిజెన్స్ అధికారులు అటు వైపు చూడరని తెలుసు. ఆ నేపథ్యంలోనే తనకు నమ్మకమైన పారిశ్రామికవేత్తలను, నేతలను పంపి పనిని చక్కబెట్టినట్లు వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.
ఇంటలిజెన్స్ వ్యవస్థ....
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఫెయిలయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఒక అభ్యర్థికి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. ఆ ఇరవై రెండు మందికి కోడ్స్ ఇచ్చారు. కోడ్స్ ప్రకారం ప్రాధాన్యత క్రమంలో వారు ఓటు చేయాల్సి ఉంది. ఆ 22 మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని ఇన్ ఛార్జిగా ఉంచారు. అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలను గుర్తించి జగన్ స్వయంగా పిలిపించి మాట్లాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ముందుగానే బేరసారాలు జరిగిపోవడంతో జగన్ వద్ద తలూపిన నేతలు ఎన్నికల సమయానికి టీడీపీకి వైపు మరలారన్నది వైసీపీ నేతల విశ్లేషణల్లో వెల్లడయింది.
గుర్తించిన ఎమ్మెల్యేలపై...
కోడ్ ప్రకారం చూసి ఆ నేతలను గుర్తించి జగన్ కు నివేదిక నేతలు అందించారు. పోటీకి నిలబెట్టారంటే చంద్రబాబు వ్యూహం ఉంటుందని ముందుగానే తెలిసినా, ఆయన ఇక్కడే ఉండటంతో ఎవరూ పసిగట్టలేకపోయారన్నది వైసీపీ నేతల భావన. చివరకు ఫలితం వచ్చిన తర్వాత కానీ అసలు విషయం తెలియరాలేదు. హైదరాబాద్, బెంగళూరుల్లో జరుగుతున్న బేరసారాలను పసిగట్ట లేకపోయారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై అధికారులపై కూడా వేటు వేసే అవకాశముందని చెబుతున్నారు. అలాగే పార్టీ ఓటమికి కారణమయిన ఇద్దరిపైనా తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారు. అయితే చర్యలకు దిగకుండా వారిపై ఎలా రివెంజ్ తీసుకోవాలన్నది కూడా తమ అధినేత ఆలోచిస్తే బాగుండునని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News