తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ఎక్కడ జరిగినా ప్రచారం కాని, ఓట్లు అడిగేది కాని వారి మాతృభాషలోనే ఉంటుంది. తెలంగాణలో తెలుగులోనే ఓట్లు అడగాల్సి ఉంటుంది. కానీ విచిత్రంగా తెలంగాణలోని ఒక నియోజకవర్గంలో మాత్రం ఓట్లు అడగాలంటే మూడు భాషలు రావాల్సి ఉంటుంది.మూడు భాషలొస్తేనే పోటీ చేసిన అభ్యర్థులు జనం ముందుకు వెళతారు. అంతేతప్ప కేవలం తెలుగులో ఓట్లు అడిగితే అక్కడ పప్పులుడకవ్. ఇంతకీ ఈ నియోజకవర్గం ఎక్కడుందో తెలుసా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో నేతలు మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగితేనే అక్కడ ఓట్లు రాలతాయి.
మూడు రాష్ట్రాల సరిహద్దులతో.....
జుక్కల్ నియోజజకవర్గానికి మూడు రాష్ట్రాల సరిహద్దులుంటాయి. ఈ నియోజకవర్గంలో నివసించే ప్రజలు మూడు భాషలు మాట్లాడతారు. తెలుగు, మరాఠీ, కన్నడ. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఈ నియోజకవర్గం ఉండటంతో ఎక్కువ మంది కన్నడ, మరాఠీ భాషలను మాట్లాడతారు. ఇక్కడ ప్రజలకు తెలుగు ఎక్కువగా రాదు. ఎక్కువగా కాదు. చాలా మంది తెలుగులో మాట్లాడలేని పరిస్థితి. ఇది పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గం. రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో ఎక్కువగా ఇక్కడ అన్ని పార్టీల నుంచి స్థానికేతరులే పోటీ చేస్తుంటారు. స్థానికేతరులైనా సరే వారి భాషలో మాట్లాడగలిగితేనే ఇక్కడ పోటీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఏ పార్టీ కూడా టిక్కెట్ కూడా ఇవ్వదు.
మరాఠా,కన్నడ, తెలుగు భాషల్లో.....
నియోజకవర్గంలోని మద్నూరు, బిచ్కుంద మండలాల్లో ప్రజలు కన్నడ,మరాఠీ భాషలు తప్ప తెలుగురాదు. కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో ఈ నియోజకవర్గంలో లింగాయత్ లు కూడా ఎక్కువగానే ఉన్నారు. వీరు కన్నడంలోనే మాట్లాడతారు. ఇక హట్కర్ సమాజ్ కు చెందిన వారు మరాఠీలోనే మాట్లాడతారు. జుక్కల్ మండలంలోని పెద్దగుల్లా, కంఠాలి, బిజ్జల్ వాడి, కథల్ వాడి, హంగర్గ, మాదాపూర్, చండేగావ్, చిన్న గుల్లా గ్రామాలకు వెళితే అక్కడ మహారాష్ట్ర సంస్కృతి కన్పిస్తుంది. ఇక బిచ్కుంద మండల గుండెకల్లూరు, దోతి ఖత్ గావ్ సోపూర్, సిద్ధాపూర్ గ్రామాల్లో యాభై శాతం మంది మాత్రమే తెలుగు మాట్లాడగలరు. మద్నూర్ మండలంల సోనాల టాక్లీ, సిర్పూర్ గొజెగావ్, చిన్న టాక్లీ, పెద్ద టాక్లీ గ్రామాల్లో కన్నడ భాష మాత్రమే కనపడుతుంది.
అభ్యర్థులు కూడా.....
ఇలా ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులందరూ ఖచ్చితంగా మూడు భాషలను నేర్చుకోవల్సిందే. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ మూడు భాషల్లో మాట్లాడే ఓటర్ల మనసును గెలుచుకున్నారంటారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, కాంగ్రెస్ అభ్యర్థి గంగారామ్ లకు కూడా మూడు భాషల్లో ప్రావీణ్యం ఉంది. మూడు రాష్ట్రాల ప్రభావం ఇక్కడ ఉండటంతో ఆయా రాష్ట్రాల ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంతు షిండే 35 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. మరి ఇక్కడ ఈసారి పరిస్థితి మాత్రం షిండేకు అంత ఈజీగా లేదని చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది.