నన్ను ఇక ఆపేదెవరు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వయసులోనే కాదు.. రాజకీయ అనుభవం కూడా నాలుగు దశాబ్దాలు. ఆయన వ్యూహాలు వేరు.

Update: 2023-03-23 14:04 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వయసులోనే కాదు.. రాజకీయ అనుభవం కూడా నాలుగు దశాబ్దాలు. ఆయన వ్యూహాలు వేరు. ఆలోచనలు వేరు. ప్రతి నిమిషమూ రాజకీయాల గురించి ఆలోచించే ఏకైక నేత చంద్రబాబు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఏ ఎన్నికను తేలిగ్గా తీసుకోరు. ఒక నిర్ణయం తీసుకున్నారంటే లోతైన ఆలోచనను, అధ్యయనం చేస్తారు. ఇన్నాళ్లు తన టైం కలసి రాలేదని ఆయన ఊరుకున్నారా? అంటే అదీ లేదు. ప్రతి ఎన్నికలోనూ పోరాడారు. ఓడినా క్యాడర్ లో ధైర్యం నింపేందుకు రాష్ట్రమంతా కలియదిరిగారు. ఆయన వెనక బలమైన మీడియా ఉండటం కూడా కలిసొచ్చే అంశమే.

బాబు ముందు కుప్పిగంతులా?
అందుకే చంద్రబాబు ముందు కుప్పిగంతులు వేయడం తగదని జగన్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. వైనాట్ 175 అని తాడేపల్లిలో పదే పదే ప్రకటిస్తుంటే చంద్రబాబు క్షేత్రస్థాయిలోకి వెళ్లి తన పనితాను చేసుకుంటున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లోనూ టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. ఇక్కడా చంద్రబాబు స్ట్రాటజీ వర్క్ అవుట్ అయింది. ప్రచారం చేయకపోయినా అభ్యర్థుల ఎంపిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ అంతా చంద్రబాబు మినిట్ టు మినిట్ పరిశీలించారు. అందుకే విజయం సాధ్యమయింది. ఆ విజయం చూసైనా జగన్ పార్టీ మేలుకొనలేదు. చంద్రబాబును తక్కవుగా అంచనా వేసింది. ఫలితం అనుభవించింది. చంద్రబాబు పార్టీ నేతల్లోనూ, క్యాడర్ లోనూ మరోసారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పెంచారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు...
ఇప్పుడు చంద్రబాబుతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లారన్నది వైసీపీ నేతలకు అర్థం కాకుండా ఉంది. వారికి చంద్రబాబు ఏ హామీ ఇచ్చారన్నది పక్కనపెడతే ఇది వైసీపీ దారుణ వైఫ్యలం. తమ మీద నమ్మకం ఎమ్మెల్యేల్లో కల్పించలేకపోయారు. వైసీపీలో ఉన్న లుకలుకలును చంద్రబాబు సరైన సమయంలో క్యాష్ చేసుకున్నారు. అందుకే చంద్రబాబు అభ్యర్థిని నిలబెట్టినప్పుడే జగన్ జాగ్రత్త పడాల్సిందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. కేవలం రెండు ఓట్లు, అదీ స్వయంకృతాపరాధంతోనే జగన్ కోల్పోవాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జగన్ ఎవరి మాట వినకపోవడమూ చంద్రబాబుకు కలసి వచ్చిందనే చెప్పాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలపై ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు చర్యలు ప్రారంభించగానే చంద్రబాబు తన వ్యూహాన్ని మొదలుపెట్టారు.
లెక్క సరిపోయింది.
అందుకే బీసీ సామాజికవర్గం నేత పంచుమర్తి అనూరాధను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. నిన్న మొన్నటి వరకూ 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు లేదు.. లేదు.. నాకు 23 మంది ఎమ్మెల్యేలున్నారని చంద్రబాబు ఈ ఎన్నికతో చెప్పకనే చెప్పినట్లయింది. 2019 ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. దీంతో వారి లెక్క 19కి పడిపోయింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి తిరిగి చంద్రబాబును లెక్కను సరిచేశారు. 23 మంది ఎమ్మెల్యేలు తన పార్టీలో ఉన్నారని చంద్రబాబు బయటకు చెప్పగలిగారు.
మూడో కంటికి తెలియకుండా.
అందుకే చంద్రబాబు ఈ ఎన్నిక ప్రారంభం దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్లకుండా ఉండవల్లిలోనే ఉండి కథ నడిపించారు. ఎవరి మాట వింటారో వారి చేత మూడో కంటికి తెలియకుండా ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నారు. కనీసం టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైసీపీ కథను సమాప్తం చేయగలిగారు. చంద్రబాబు చెప్పింది చెప్పినట్లు ఆయన టీం చేసింది. ఫలితంగా జగన్ ను చావుదెబ్బ కొట్టగలిగారు. పెద్దాయన వ్యూహం ఫలించింది. చంద్రబాబుకు ఇప్పుడు అన్నీ వరసగా కలసి వస్తున్నాయి. అందుకే ఎన్నికలకు ముందు వరస విజయాలు దక్కుతున్నాయి. ఇక టీడీపీని ఆపేదెవరు? అన్న రీతిలో చంద్రబాబు భవిష్యత్ రాజకీయ ప్రయాణం సాగనుంది.


Tags:    

Similar News