సీఎం సారు... నీ "కమ్మ"ని దెబ్బ..?

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల పై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్వాగతించారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు

Update: 2021-12-02 13:02 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవ్వుతారు. ఎవ్వరు ఏమి అడిగినా చిరునవ్వులు చిందిస్తారు. ఏ విజ్ఞప్తికి కాదని అనరు. అలాగని అవునని అనరు. ఊరికే నవ్వుతారు. ఈ నవ్వు కి నలభై విధాల అర్ధాలు ఉంటాయని పని పూర్తయ్యాక తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్ నవ్వుకి అర్థం తెలుగు సినీ పెద్దలకు ఆలస్యంగా అర్థమైంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల పై ఆయన తీసుకున్న నిర్ణయంతో. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతించారు. మరికొందరు అలిగారు. చాలామంది మాత్రం... అమ్మ నీ "కమ్మ"ని దెబ్బ అన్నారు.

ఫిక్స్ చేసిన జగన్...
ఎంత పెద్ద హీరో సినిమా అయినా బెనిఫిట్ షోలు ఉండవని, వెండితెర మీదే కాదు ప్రభుత్వం ముందు కూడా అందరూ సమానులే అని సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. నగరాలు, పట్టణాలు, సినిమా థియేటర్లను విభజించడం తో పాటు మల్టీప్లెక్స్లు, ఏసీ థియేటర్లు, నాన్ ఏసీ థియేటర్లు అంటూ విభజించి ప్రతీ దానికి ఒక్కో రేటును సీఎం జగన్ ఫిక్స్ చేశారు. ప్రేక్షకులలో మూడు వంతుల మంది ఓటర్లు అయిన ఈ లోకంలో వారి వైపు నుంచి చూస్తే ఇది సరైన నిర్ణయం. సినీ పరిశ్రమ వైపు నుంచి చూస్తే మాత్రం అవాక్కయ్యే నిర్ణయం. ఐదు రూపాయలకు కూడా టీ దొరకని ఈ రోజుల్లో సినిమా టికెట్ ధరలు ఐదు రూపాయల నుంచి ప్రారంభించారు సీఎం. ఇది పెద్ద హీరోల చిత్రాలకు "అఖండ"మైన దెబ్బ.
సినీ పెద్దలు కలిసినా....
తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒకే కులం చేతిలో ఉందని, వారంతా పచ్చ చొక్కాల సానుభూతిపరులని ఎన్నికలకు ముందే ఓ నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రి. వారిని సినిమా టికెట్ల అంశాన్ని ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుందని ప్రచారం జరిగింది. పెద్ద సినిమాల కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదనే కారణంగా సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తుందని తన చర్యతో తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు మెగాస్టార్ చిరంజీవి సీఎంను కలిశారు. తన ఇంటికి వచ్చిన అతిథికి పెట్టి సకల మర్యాదలు చేశారు తప్ప ఈ విషయంలో సీఎం ఎలాంటి హామీ ఇవ్వలేదు. చిరంజీవి తర్వాత మరోసారి నాగార్జున కూడా సీఎంను కలిశారు. వ్యక్తిగత స్నేహం పేరుతో కలిసిన ఆంతరంగికంగా మాత్రం సినిమా టికెట్ల ధరలు అంటూ ప్రచారం జరిగింది. నాగార్జున కూడా ముఖ్య మంత్రి మర్యాదగా చూశారు. ఓ నవ్వు నవ్వారు. ఏ హామీ ఇవ్వలేదు.
పెరిగిన ధరలు...
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా మరో సారి ఆలోచించండి అంటూ విజ్ఞప్తి చేశారు. అది విన్నారు. మళ్లీ మరోసారి నవ్వారు. పైన నవ్వు కి, లోపలి నిర్ణయానికి సంబంధం లేదు. సినిమా టికెట్ల ధరలు అయిపోయాయి. ఉత్తర్వులు వచ్చేసాయి. ఎవరు తన్నుకుంటారో వెండితెర మీద చూడాల్సిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని " అమ్మ నీ కమ్మని దెబ్బ" అంటున్నారు.



- ముక్కామల చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్


Tags:    

Similar News