ముసలాయనా.. సెల్ఫీ ఛాలెంజ్ అంటే ఇది
గతంలో ఒక ముసలాయన ముఖ్యమంత్రిగా ఉండేవారని, ఆయనకాలంలో డీబీటీ పద్ధతిలో నగదును జమ చేశారా? అని జగన్ ప్రశ్నించారు
గతంలో ఒక ముసలాయన ముఖ్యమంత్రిగా ఉండేవారని, ఆయనకాలంలో డీబీటీ పద్ధతిలో నగదును జమ చేశారా? అని జగన్ ప్రశ్నించారు. మార్కాపురంలో ఈబీసీ నేస్తం కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పథకాలు ఏవైనా ఉండేవా? అని ప్రశ్నించారు. లంచాలు లేకుండా వివక్షకు తావులేకుండా అందరికీ అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించమని కోరుతున్నానని చెప్పారు. ఆ ముసలాయన ఒక్క రూపాయి కూడా మీ ఖాతాల్లో వేశాడా? అని జగన్ ప్రశ్నించారు. గతంలో అదే రకమైన బడ్జెట్ ఉందని, ఇప్పుడు అదే బడ్జెట్ ఉందని, కానీ ఈ పథకాలు అప్పుడు ఎందుకు లేవని జగన్ ప్రశ్నించారు.
జగన్ ఛాలెంజ్...
సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదని, ఈరాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మంచి జరిగిందని చెప్పడమే అదే నిజమైన గొప్ప సెల్ఫీ అని జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం గొప్ప పనిచేసిందని ఆశీర్వదిస్తే దానిని సెల్ఫీ అంటారని జగన్ అన్నారు. ఏ గ్రామంలోనైనా, ఏ పేద కుటుంబమైనా గత ప్రభుత్వంలో జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వంలో అందిన పథకాలు ఎన్ని? అని బేరీజు వేసుకునే సత్తా ఉందా? అని చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్ విసిరారు. ప్రజలకు అందరికీ నిజాలు తెలుసునని అన్నారు. అబద్ధాల బ్యాచ్ ను నమ్మవద్దని, రివర్స్ లో అడగాలని జగన్ ప్రజలను కోరారు. తమ ప్రభుత్వంలో 30 లక్షల ఇంటి స్థలాల గురించి వారిని ప్రశ్నించాలన్నారు. సెల్ఫీ దిగే అర్హత ఉందా? అని చంద్రబాబును అడగాలని జగన్ కోరారు.
చంద్రబాబును గట్టిగా అడగండి...
ప్రజలు ఆలోచన చేయాలని జగన్ కోరారు. 2,07 లక్షల కోట్లను లబ్దిదారులకు తనపరిపాలనలో ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయిందన్నారు. ఆ డబ్బంతా ఎవరు తిన్నారని జగన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మహిళ సంక్షేమం కోసమే పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఓసీల్లో పేద మహిళలకు న్యాయం జరగాలనే ఈబీసీ నేస్తం పథకాన్ని అమలులోకి తెచ్చామని తెలిపారు. పేదరికానికి చికిత్స చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళలనే అన్ని పథకాల్లో లబ్దిదారులుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జగన్ అన్నారు. అమ్మఒడి ద్వారా 45 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిందన్నారు. ఈ45 లక్షల మంది చంద్రబాబును అడగాలని, తమ ఇంటిముందు సెల్ఫీ దిగే అర్హత ఉందా? అని బాబును ప్రశ్నించాలన్నారు. రైతు రుణ మాఫీ చేస్తానని మోసం చేస్తానని చంద్రబాబును నిలదీయాలని జగన్ పిలుపు నిచ్చారు.
అక్టోబరులో వెలిగొండ ప్రారంభం...
కనీసం ఇంటిముందు స్టిక్కర్ అంటించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చి విస్మరించిన చంద్రబాబును పొదుపు సంఘాలు నిలదీయాలని కోరారు. చంద్రబాబు పాలనలో అందరినీ మోసం చేశారని అన్నారు. జన్మభూమి కమిటీలు మంచివా? వాలంటీర్ల వ్యవస్థ మంచిదా? అని నిలదీయాలని కోరారు. ఈ అక్టోబరులో వెలింగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని జగన్ మార్కాపురం సభలో ప్రకటించారు. మొదటి టన్నెల్ ను తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తిచేశామని జగన్ గుర్తుచేశారు. రెండో టన్నెల్ కూడా పూర్తి కావచ్చిందన్నారు. మార్కాపురంలో జరిగిన బహిరంగ సభ తర్వాత జగన్ బటన్ నొక్కి 4.58 మంది లబ్దిదారులకు 658 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గానికి కోట్లనిధులను జగన్ ప్రకటించారు.