ఎపి సీఎం చంద్రబాబు పై వచ్చే ఎన్నికల్లో పెద్ద మచ్చ ఒకటే వుందన్నది పబ్లిక్ టాక్. కేంద్రం రాష్ట్రానికి నాలుగేళ్ళుగా ఏమి చేయకపోయినా ఎన్డీయే లో ఎందుకు కొనసాగారన్నది ప్రజలనుంచి టిడిపి కి ఎదురౌతున్న ప్రశ్న. నాలుగేళ్ళు కాపురం చేసి ఇప్పుడు విడాకులు తీసుకుని చిన్నపిల్లల్లాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎలా మోసపోతారన్నది జగన్, పవన్ ల సూటి ప్రశ్న. వీటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు ఎపి సీఎం. ప్రజల్లోనే కాదు పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేసేందుకు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామదర్శిని కార్యక్రమాల్లో క్లారిటీ ఇచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసమే ...
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం అనేక సమస్యలు చుట్టిముట్టి ఉండటంతో బిజెపి తో రాజీ పడక తప్పలేదని తేల్చేశారు చంద్రబాబు. ఎపి అభివృద్ధి కోసం బిజెపితో జట్టుకట్టాలిసి వచ్చిందని అయితే వారు మోసం చేశారని మరోసారి వ్యాఖ్యానించారు. ధర్మపోరాటం ఆగదని పోరాటం చేయడంలో తనకు మించిన వారు ఎవరున్నారని కూడా ప్రత్యర్థులకు సవాల్ విసిరారు చంద్రబాబు. నాలుగేళ్ళు ఓపిక పట్టి రాజీ పడుతూ వచ్చినా ఇక చివరిగా ప్రయోజనం లేదని అర్థమైందన్నారు.
ప్రధానిపై విమర్శలు.....
దాంతో బయటకు వచ్చి పోరాడుతున్నామని వివరించారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా బిజెపితో తాను పడిన రాజీ ప్రజలకోసమే అని తేల్చేశారు బాబు. అంతేకాదు సీనియర్ అయిన తనను ఎవరూ మోసం చేయలేరన్నారు. తాను ఎవరి ట్రాప్ లో పడలేదని మరీ వివరణ ఇచ్చారు. బీజేపీయే వైసీపీ కుడితిలో పడిందని ఎద్దేవా చేశారు. ప్రధానికి పరిణితి లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి ఎపి వాసులు టిడిపి అధినేత చేసిన ఈ వ్యాఖ్యలను ఎంతవరకు స్వీకరిస్తారో ఎంతవరకు నమ్ముతారన్నది వచ్చే ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.