ప్రధాని నరేంద్ర మోదీ మీద చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తాను యూటర్న్ తీసుకున్నానని ప్రధాని వ్యాఖ్యానించడం పట్ల బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్లమెంటు సభ్యులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఒంగోలులో జరగనున్న ధర్మపోరాట సభకు పార్లమెంటు సభ్యులంతా విధిగా హాజరుకావాలని ఆదేశించారు. తాను ఎప్పుడూ యూటర్న్ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం, మోదీయే యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అన్నీ యూటర్న్ లే.....
రాష్ట్రానికి ఇచ్చిన 350 కోట్లు ఇచ్చి తిరిగి వెనక్కు తీసుకోవడం యూటర్న్ కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మేనిఫేస్టోలో పెట్టిన హామీలను అమలు చేయకపోవడం యూటర్న్ కాదా? అని అన్నారు. వైసీపీ, జనసేన, బీజేపీలు కుమ్మక్కై టీడీపీని బలహీన పర్చాలని చూస్తుందని, కాని ప్రజలు వీరిని నమ్మరని చంద్రబాబు చెప్పారు. బీజేపీ తీసుకున్న యూటర్న్ ను పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారు. టీడీపీ ఎప్పుడూ రైట్ టర్న్ లోనే వెళుతుందన్నారు. పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మాట తప్పిందన్నారు.