"సై" అంటున్న చంద్రబాబు

Update: 2018-06-21 03:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఎన్నికల మూడ్ లోకి వెళ్లినట్లే కన్పిస్తోంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆయన యుద్ధం చేసేందుకు యంత్రాంగాన్ని సర్వం సిద్ధం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి బూజు పట్టిన ఫైళ్ల దుమ్ము దులిపేస్తున్నారు. అడక్కుండానే వరాలు కురిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

బూజు పట్టిన ఫైళ్లను.....

నాలుగేళ్లుగా అదిగో...ఇదిగో అని ఊరించిన నిరుద్యోగ భృతిని నిరుద్యోగులకు త్వరలోనే అందజేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులుంటే వారిలో పది లక్షల మంది వరకూ ఈ ప్రయోజనం పొందే అవకాశముంది. తొలివిడతలో ఎందరికి ఈ భృతి అందుతుందన్నది తెలియకున్నా యువతనే లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు త్వరలోనే స్కీమ్ సీన్ లోకి తేనున్నారు. గత నాలుగేళ్లుగా కేవలం ప్రతిపాదనలకే పరిమితమైన ఈ అంశాన్ని త్వరితగతిన గ్రౌండ్ చేయాలని అధికారులను బాబు ఆదేశించారు.

అంగన్ వాడీలకు వరాలు....

ఇక ఎప్పటి నుంచో ఆందోళన బాట పట్టిన అంగన్ వాడీలకు కూడా చంద్రబాబు తీపికబురు చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలకు గతంలో నెలకు ఏడు వేల రూపాయల జీతం ఉండేది. వేతనాలు పెంచాలంటూ ఎన్నోమార్లు అంగన్ వాడీలు రోడ్డు ఎక్కారు. కాని ఎన్నికల సమయం కదా....వెంటనే చంద్రబాబు అంగన్ వాడీ టీచర్ల వేతనాన్ని ఏడు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచేశారు. అంగన్ వాడీల్లో పనిచేేసే ఆయాలకు నాలుగున్నర వేయి నుంచి ఆరువేలకు పెంచారు. ఇలా చంద్రబాబు ఎన్నికల వేళ అడక్కుండానే అంగన్ వాడీలకు వరాలిచ్చేశారు.

మరిన్ని వరాలు.....

తొలి నుంచి చంద్రబాబు మహిళల ఓట్లపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు. మహిళలు తన పరిపాలనా సామర్థ్యాన్ని గుర్తిస్తారన్నది ఆయన విశ్వాసం. అందుకే డ్వాక్రా మహిళలు, పొదుపు సంఘాలు, సాధికార మిత్ర వంటి స్కీమ్ లతో పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. వారి సాయంతో మళ్లీ గద్దెనెక్కాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు వారు సంతృప్తి పడేలా చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సై అనే అంటున్నారు.

Similar News