బాబు టార్గెట్ గా ముద్రగడ....?

Update: 2018-04-12 02:30 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయన కాపు జేఏసీ కార్యచారణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. త్వరలోనే కాపు రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. చంద్రబాబు తన అనుభవం ముందు ఒక పిల్లకాకి అని ముద్రగడ ఫైరయ్యారు. దేశంలోనే సీనియర్ నేతనని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తాకట్టు పెట్టారన్నారు.

అన్నీ డ్రామాలే.....

చంద్రబాబు చేసేవన్నీ డ్రామాలేనని ముద్రగడ అన్నారు. ప్రధాని మీద నిరసనలు, దీక్షలు చేపట్టకుండా సామాన్య ప్రజలతో దీక్షలు చేయించడం ఏంటని ముద్రగడ ప్రశ్నించారు. గతంలో తనకు ఓటేయనందుకు సిగ్గుపడాలన్న చంద్రబాబు, ఇప్పుడు ఏపీ ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నారన్నారు. టీడీపీని నమ్మితే నట్టేట మునుగుతామని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకూ చంద్రబాబును నమ్మవద్దని ఆయన కాపు సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు.

తనకు ఎందుకు అనుమతివ్వలేదు.....

కాపు రిజర్వేషన్ల ఉద్యమ కోసం తాను పాదయాత్ర చేస్తానన్నా అనుమతి ఇవ్వని చంద్రబాబు, నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడి చేస్తామంటే ఎందుకు అనుమతిస్తామని నిలదీశారు. తన ఉద్యమాలను ఏపీ ప్రభుత్వం అణిచివేసిందన్నారు. ఇలా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని చంద్రబాబును తొక్కేయాలని ఆయన పిలుపు నిచ్చారు. తొలి నుంచి చంద్రబాబుకు చీకటి రాజకీయాలు అలవాటేనన్న ముద్రగడ చంద్రబాబు గత నాలుగేళ్లుగా చేసిన పాపాలను ఇంకొకరిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

త్వరలోనే ఉద్యమ కార్యాచరణ......

కాపు రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్రానికి పంపామని చంద్రబాబు చేతులు దులుపుకుంటున్నారని, త్వరలోనే దీనిపై ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ సన్నిహితులు తనను కలిశారని, అయితే ఆరునెలలు ఇంట్లో ఉండి రెండు రోజులు ఉద్యమం చేస్తే సరిపోదని, ప్రతి రోజూ వీధిలోనే ఉంటే సక్సెస్ అవుతారని తాను చెప్పానని ముద్రగడ వివరించారు. మొత్తం మీద ముద్రగడ మరోసారి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Similar News