వైసీపీ అధినేత జగన్ పై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అవకాశమొచ్చినప్పుడల్లా విరుచుకుపడుతుంటారు. నిన్న మహానాడులో కూడా జగన్ నే టార్గెట్ చేసుకున్నారు జేసీ. జగన్ ఒక అహంకారి అని, ఎవరి మాట వినరనీ, అన్నీ ఆయనకు తాతబుద్ధులే వచ్చాయని జేసీ జగన్ పై తీవ్ర విమర్శలే చేశారు. అయితే తనను 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని రాయబారం పంపారని తెలిపారు జేసీ. రాయబారిగా ఇప్పటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన వద్దకు వచ్చారని, పార్టీలో చేరమనకుండా ఎంత డబ్బులు ఖర్చు పెడతావని తనను అడగటంతో ఆగ్రహం చెంది ఆ పార్టీలోకి వెళ్లలేదని చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి. మహానాడు వేదికగా జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఆయనే టిక్కెట్ కోసం వచ్చి.....
అయితే వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరతామంటూ ఎంతో మంది తమ అధినేత జగన్ ను సంప్రదించారని, అందులో జేసీ దివాకర్ రెడ్డి ఒకరని చెబుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి రెండు స్థానాలు అడిగినందున, జగన్ కుదరదన్నారని అందుకే ఆయన టీడీపీలోకి వెళ్లిపోయారంటున్నారు వైసీపీ నేతలు. ఆ సమయంలో డబ్బుల ప్రస్తావనే రాలేదని జేసీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటున్నారు. జేసీకి తొలినుంచి భజన చేయడం అలవాటేననిఅన్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.
బాబును తృప్తి పర్చేందుకే....
చంద్రబాబు నాయుడిని సంతృప్తి పర్చేందుకు వచ్చే ఎన్నికల్లో తిరిగి రెండు టిక్కెట్లు సాధించుకునేందుకే జేసీ జగన్ పై లేని పోని ఆరోపణలు చేశారంటున్నారు. జగన్ పై అనవసర ఆరోపణలు చేయడం జేసీకి తొలి నుంచి అలవాటేనన్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పార్టీలో పట్టు పెంచుకునేందుకే జగన్ ను జేసీ తిడుతున్నారన్నారు. జగన్ ను తిడితే చాలు చంద్రబాబు వారికిఏదైనా చేస్తారన్న నమ్మకంతోనే జేసీ జగన్ పై నోరుపారేసుకున్నారని వైసీపీ నేతలు విమర్శించారు.
ఎప్పటికైనా చంద్రబాబుకు తలనొప్పే.....
ఎప్పటికైనా జేసీ చంద్రబాబుకు తలనొప్పిగా మారతారని కూడా వారు జోస్యం చెబుతున్నారు. ఇప్పుడే తన వర్గానికి చెందిన వారిని వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేయించేందుకు జేసీ ప్రయత్నాలు ప్రారంభించారని, తెలుగుదేశం పార్టీ నేతలే జేసీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. జేసీ మాటలను ప్రజలు ఎవరూ పట్టించుకోరని, ఆయన ఒక జోకర్ గానే భావిస్తారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కూడా జేసీ అనేకసార్లు జగన్ పై అనవసర వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద జేసీ జగన్ పై ఇంతలా కసి పెంచుకోవడానికి కారణమేంటన్నది కూడా మహానాడులో చర్చనీయాంశంగా మారింది.