ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని గొంతులూ ఒక్కటై నినదించనున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బంద్ కు విపక్షాలన్నీ పిలుపునిచ్చాయి. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపునకు వైసీపీ, జనసేన, వామపక్ష పార్టీలు మద్దతు తెలపడంతో ఈరోజు ఏపీ బంద్ సంపూర్ణంగా జరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు ఏపీ బంద్ కు అన్ని విపక్షాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉదయాన్నే విపక్ష పార్టీ నేతలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.
నేడు ఏపీ బంద్.....
ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ఈ బంద్ జరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ ఈ బంద్ కు పిలుపునివ్వకపోయినా విపక్షాలకు సహకరించాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంద్ లు, రాస్తారోకోలతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, రాష్ట్రమే దీనివల్ల నష్టపోతుందని చెబుతున్నారు. అయినా విపక్షాలు మాత్రం కేంద్రానికి సెగ తాకాలంటే బంద్ చేయాల్సిందేనంటూ రంగంలోకి దిగాయి.
టీడీపీ, బీజేపీ దూరం.....
మరోవైవు ఈ బంద్ కు రాష్ట్ర బీజేపీ కూడా దూరంగా ఉంది. ఇక వైసీపీ సంపూర్ణ మద్దతును బంద్ కు పిలుపు నివ్వడంతో ఏపీలో నేడు టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశముంది. ప్రతిపక్ష నేత జగన్ బంద్ కారణంగా తన పాదయాత్రకు ఈరోజు విరామాన్ని ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడలో పర్యటిస్తున్న జగన్ తన పాదయాత్రను ఈరోజు చేయడం లేదని, బంద్ కు సంఘీభావం తెలుపుతున్నానని ప్రకటించారు. బంద్ లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొననున్నాయి.