రాష్ట్రపతి అభ్యర్థి ఆయనైతే జగన్ ఝలక్ ఇస్తారట

జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఒక స్పష్టత నిచ్చారు. వైసీపీ బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరమని ప్రకటించారు.

Update: 2021-11-27 04:31 GMT

జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఒక స్పష్టత నిచ్చారు. వైసీపీ బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరమని ప్రకటించారు. ఇకపై రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే నిర్ణయాలుంటాయని జగన్ చెప్పకనే చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై పోరాడాలని జగన్ పిలుపు నిచ్చారు. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జగన్ అడుగులు ఎటువైపు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

గులాం నబీ...
ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాష్ట్రపతిగా ఎంపిక చేస్తారా? లేదా? అన్నది ఇంకా ఖరారు కాలేదు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉండనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత అసంతృప్త నేత గులాం నబీ ఆజాద్ పేరు కూడా రాష్ట్రపతి రేసులో వినపడుతుంది. అయితే గులాం నబీ ఆజాద్ అయితే జగన్ ఆయనకు మద్దతిచ్చే అవకాశాలుండవన్న చర్చ పార్టీలో జరుగుతుంది.
మైనారిటీ నేత అయినా....
ఇందుకు రెండు కారణాలు. ఒకటి గులాం నబీ ఆజాద్ మైనారిటీ అయినప్పటికీ కాంగ్రెస్ అప్పటి రాష్ట్ర విభజన చేసే సమయంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ కోర్ కమిటీలో ఆయన ఒకరు. అందుకే గులాం నబీ ఆజాద్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే మద్దతు ఇవ్వకూడదన్న అభిప్రాయం పార్టీలోనూ వ్యక్తమవుతుంది. అదే అభిప్రాయంలో జగన్ సయితం ఉన్నారు.
రాష్ట్ర విభజనకు.....
అదే రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేస్తే జగన్ మద్దతిచ్చే అవకాశాలుంటాయి. తెలుగువాడు కావడం, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేత కావడంతో ఆయనకు మద్దతివ్వాల్సి ఉంటుంది. పొరుగున ఉన్న తెలంగాణ కూడా వెంకయ్య నాయుడు అయితే బేషరతుగా మద్దతిస్తుంది. కానీ గులాం నబీ ఆజాద్ ను ఎంపిక చేస్తే జగన్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారంటున్నారు. తాను మైనారిటీలకు ఇక్కడ అనేెక పదవులు ఇచ్చానని, రాష్ట్ర విభజనకు కారణమైన నేత విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జగన్ అన్నట్లు తెలిసింది.


Tags:    

Similar News