దేవినేని వార్నింగ్ ఫ‌లిస్తుందా

Update: 2018-06-06 07:00 GMT

టీడీపీకి కంచుకోటగా మారిన అనంత‌పురం రాజ‌కీయాల్లో ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు జోరుగా చ‌క్రం తిప్పుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇష్టారాజ్యంగా ప్ర‌వ‌ర్తించిన టీడీపీ నాయ‌కుల‌ను ఏక‌తాటిపైకి తెచ్చేందుకు ఆయ‌న కృషి చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టీ అనంత‌పై ప‌డింది. 2014 ఎన్నిక‌ల్లొ ఇక్క‌డ టీడీపీ స‌త్తా చాటింది. అయితే, ఎవ‌రికి వారే సీనియర్లు కావ‌డంతో నేత‌లు త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించేవారు. ఫ‌లితంగా అనంతపురం జిల్లా టీడీపీలోని దిగ్గజాల మధ్య సయోధ్య కరువైంది. ఒకరంటే మరొకరికి గిట్టడం లేదు. స్వలాభం కోసం పార్టీ శ్రేణులను కూడా దూరం పెడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లలో కామినేని శ్రీనివాస్ ఈ జిల్లాకి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఆయన పార్టీపై నియంత్రణ చేయలేని పరిస్థితి.

ఆ తర్వాత మంత్రి కొల్లు రవీంద్రకి పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. ఇప్పుడు మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఈ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా తెరపైకి వచ్చారు. దేవినేని రంగంలోకి వచ్చాక అనంతపై సీరియస్‌గా దృష్టిసారించారు. నేతల మధ్య ఉన్న విభేదాలు గుర్తించి.. ఎక్కడికక్కడ కళ్లెం వేసే ప్రయత్నం చేశారు. ఈ మధ్య పుట్టపర్తిలో చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన జిల్లా మహానాడు జరిగింది. ఈ వేదిక పైనుంచే దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. పార్టీలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల మధ్య ఉన్న విభేదాలను అధినేత క్షమించరని స్పష్టంచేశారు. ఈ గొడవలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆయా నేతలకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం కలగడం లేదని అన్నారు. ఎంతటివారికైనా అధినేత నిర్ణయమే శిరోధార్యమని చురకలంటించారు.

అనంతపురం జిల్లా ముఖ్య నేతలు ఇకనైనా మేలుకోవాలని కోరారు. తమ మధ్య ఉన్న విభేదాలకు స్వస్తి చెప్పాలని విజ్ఞప్తిచేశారు. గొడవలతో కాలక్షేపం చేసేవారికి ఎప్పటికీ ప్రోత్సాహం లభించదన్నారు. వేదిక మీద ఉన్నవారే కాదు- వేదిక కింద ఉన్నవారికి కూడా ఈ విషయంలో మినహాయింపు లేదన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి దేవినేని ప్రసంగానికి కార్యకర్తలు ముగ్ధులయ్యారు. వారిలో ఉత్సాహం వచ్చింది. సభానంతరం తిరిగి వెళుతున్న దేవినేని ఉమాను కార్యకర్తలు చుట్టూముట్టారు. మంచి ప్రసంగం చేశారంటూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. దేవినేని ఉమా చేసిన హెచ్చరికల నేపథ్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

గ్రూపుల గోల‌...

జిల్లాలో ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డిది ఓ గ్రూపు, ప‌రిటాల సునీత‌, ప‌య్యావుల కేశ‌వ్‌, నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌, ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి, బీకే.పార్థ‌సార‌థి, కందికుంట ప్ర‌సాద్, చాంద్ పాషా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రూపులు ఉన్నాయి. గ్రూపుల నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు న‌లిగిపోతున్నారు. దేవినేని ఈ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీ క్యాడర్‌ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న స్థానాలతో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా పసుపు జెండా ఎగురవేస్తే ఇక ఈ జిల్లాలో వైసీపీకి స్థానమే ఉండదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మొత్తంగా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న విధంగా ఉన్న అనంత‌లో టీడీపీ నేత‌ల‌ను ఏక‌తాటిపైకి తెచ్చేందుకు మంత్రి ఉమా చేస్తున్న ప్ర‌య‌త్నం ఏమేర‌కు స‌ఫ‌లీకృతం అవుతుందో చూడాలి.

Similar News