ప్రసన్న... చంద్రబాబును పొగిడారు...ఇలా

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబుకు అభినందనలు తెలపడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2022-06-13 05:10 GMT

మంత్రి పదవి రాని వారు అసంతృప్తితో లోలోపల రగిలిపోతున్నారు. తమ సీనియారిటినీ కూడా చూడకుండా జగన్ తమకు మంత్రి పదవి ఇవ్వలేదని కొందరు ఎమ్మెల్యేల్లో అసహనం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబుపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభినందనలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఈ విశేషం చోటు చేసుకుంది.

ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో
ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. అయితే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే పదవీ కాలం మధ్యలో మరణిస్తే పోటీ పెట్టకూడదని టీడీపీ ఒక నియమం పెట్టుకుందని, దానికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని, అందుకు ఆయనను అభినందించాల్సిందేనని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబుకు అభినందనలను తెలుపుతున్నానని కూడా చెప్పారు.
మంత్రి నారాయణస్వామి మాత్రం...
అయితే అదే వేదికపై ఉన్న మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ప్రసన్న కామెంట్స్ ను ఖండించారు. టీడీపీ పోటీ చేయకోయినా వైసీపీకి వ్యతిరేకంగా అనేక కుట్రలు చేస్తుందని, చంద్రబాబును ప్రశంసించడం తగదని సూచించారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా అదే వేదిక మీద ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక్కసారి చంద్రబాబును పొగడటంతో అక్కడ వేదిక మీద ఉన్న వారితో పాటు హాజరయిన ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News